బర్డ్ ఫ్లూ ప్రభావం వల్ల నాన్వెజ్ మీద బాగా పడింది. చికెన్ కొనుగోళ్లు పడిపోవడంతో…మటన్.. చేపలు.. రొయ్యాలు మీద ప్రభావం బాగా పడింది. నాన్ వెజ్ ప్రియులు చికెన్కు ప్రత్యామ్నాయంగా చేపల కొనుగోళ్లు చేస్తుండటంతో వీటికి గిరాకీ పెరిగింది. దీంతో చేపల రకాలను బట్టి కిలోపై రూ.30 నుంచి రూ.100 వరకు ధరలు పెరిగాయి. అయినా కొనుగోళ్లు తగ్గలేదు. ఆదివారం హైదరాబాదులోని ముషీరాబాద్ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది.
నగర నలుమూలల నుంచి కొనుగోలు చేయడానికి రావడంతో చేపల మార్కెట్ సందడిగా మారింది. సాధారణ రోజుల్లో వ్యాపారులు 40 టన్నుల వరకు అమ్మకాలు సాగించేవారు. అయితే ఆదివారం ఒక్కరోజు దాదాపు 60 టన్నుల చేపల విక్రయాలు జరిపినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చేపల కొనుగోలుకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు రేట్లు పెంచేశారు. సాధారణ రోజుల్లో రవ్వ రకం కిలో రూ.140 ఉండగా, ప్రస్తుతం రూ.160 నుంచి రూ.180కి పెంచారు. అలానే బొచ్చ కిలో రూ.120 ఉండగా ఇప్పుడు రూ.140, కొర్రమీను రూ.450 నుంచి రూ.550, రొయ్యలు సాధారణ రోజుల్లో రూ.300 ఉండగా, ఇప్పుడు రూ.350 పలికినట్లు చేపల వ్యాపారులు చెప్తున్నారు. నాన్ వెజ్ ప్రియులు ఇక కాస్త హడలే.