- 4 వేలకుగా పైగా కోళ్ల మృత్యువాత
- సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులు
వనపర్తి జిల్లాలోని బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు చెందిన కోళ్ల ఫామ్లో 4000 కోళ్లు మృత్యువాతపడ్డాయి. బర్డ్ ఫ్లూ వ్యాధితో ఇంత పెద్ద సంఖ్యలో కోళ్లులో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎప్పటి లాగే బుధవారం ఉదయం రైతు శివకేశవరెడ్డి కోళ్లఫామ్కు వొచ్చి చూడగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయి కనిపించాయి. దీంతో వాటిని గుంతలో పోడ్చేశారు. అయితే నాలుగు వేల కోళ్ల మృతిపై వెటర్నరీ అధికారులకు రైతు సమాచారం ఇచ్చాడు. అయితే అధికారులు పట్టించుకోకపోవడంతో రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోళ్లు చనిపోవడంపై రైతు మాట్లాడుతూ.. ఇన్ని కోళ్లు చనిపోవడానికి కారణం ఏంటో చెప్పాలని.. తనకు న్యాయం చేయాలని కోరారు. బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయాయని అనుకుంటున్నానని.. దానిపై అధికారులు నిర్ధారణ చేయాలన్నారు.
ప్రతీసారి తనకు కోళ్లపై లాభం వొచ్చేదని.. కానీ ఈసారి మాత్రం పూర్తి నష్టపోయాయనని న్యాయం చేయాలని రైతు కోరుతున్నారు. కాగా.. 5500 కోళ్ల కెపాసిటీతో నిర్మించిన శివకేశవరెడ్డికి చెందిన కోళ్లఫామ్లో నాలుగు వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ కోళ్లను ప్రీమియర్ కంపెనీ నుంచి సాకుతున్నాడు రైతు. అయితే నిన్నటి నుంచి కోళ్లు చనిపోవడాన్ని గుర్తించిన శివకేశవ రెడ్డి కంపెనీ యాజ మాన్యానికి ఫోన్లో సమాచారం అందించారు. అయితే దీన్ని తేలిగ్గా తీసుకున్న కంపెనీ యాజమన్యం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రైతుకు చెప్పింది. అయితే బర్డ్ ఫ్లూగా అనుమానించిన శివకేశవరెడ్డి నిన్న చనిపోయిన 500 కోళ్లను గొయ్యి తీసి పాతిపెట్టాడు. దాదాపు 4000 కోళ్లు మృత్యువాత పడటంతో వాటిని కూడా గోతి తీసి పాతిపెట్టాడు రైతు. ఇలా వరుసగా కోళ్లు చనిపోవడంపై పశుసంవర్ధక శాఖ అధికారులకు ఫోన్లో సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామంలో పౌల్ట్రీ రైతులు ఆందోళనకు దిగారు.