తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేస్తోందని, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా.. అనుమతులు లేని ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం నిధుల వర్షం కురిపిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపి.. ఏపీ నిర్మిస్తున్న గోదావరి బంకచర్లను ఆపాలన్నారు. లేకుంటే.. ఢిల్లీలో సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి.. తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. గోదావరి బంకచర్లను ఆపాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసులు వేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, సాగునీటి ప్రయోజనాలు కాపాడటంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని.. మౌనంగా ఉండి.. సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చుకుంటే.. చంద్రబాబు 2018లో కేంద్ర జలవనరులకు లేఖ రాశారని, దిండి, పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఇవ్వొద్దని చంద్రబాబు లేఖలు రాశారని అన్నారు. KRMB, GRMB అనుమతులు లేకుండా.. ఏపీ ప్రాజెక్టులు కడుతోందన్నారు. ఏ అనుమతి లేకుండా..గోదావరి బంకచర్ల ప్రాజెక్టును ఏపీ నిర్మిస్తోందని, కేంద్రం తన చేతుల్లో ఉందని.. ఏపీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తోందని హరీష్ రావు అన్నారు.
తెలంగాణకు నష్టం జరుగుతుంటే..
తెలంగాణకు నష్టం జరుగుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నీతీ ఆయోగ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించలేదని విమర్శించారు. మీటింగ్ కు వెళ్ళనన్న ముఖ్యమంత్రి.. ఆయోగ్ మీటింగ్లో అందరి కంటే ముందే కూర్చున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవా అని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్ళాలని కోరారు. అన్ని పార్టీ నేతలను కిషన్ రెడ్డి ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్ళాలని హరీష్ రావు అన్నారు.
ఏపీకి ఒక నీతి.. తెలంగాణకు మరొక నీతా..
ఏపీకి ఒక నీతి.. తెలంగాణకు మరొక నీతి అన్నట్లు కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తోందని, ప్రాజక్టుల నిర్మాణానికి రూ. లక్ష 60 వేల కోట్లు ఏపీకి కేంద్రం ఇస్తోందని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరానికి అన్ని అనుమతులు ఇచ్చాక.. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసిందని.. మంత్రి ఉత్తమ్.. ఉత్తిత్తి మాటల వలన.. ఈ ఏడాది తెలంగాణ 65 టీఎంసీల నీటిని కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. మళ్ళీ జలదోపిడీ మొదలైందని, గతంలో కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతకాని తనం వలన 200 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ తరలించుకుపోతోందని, గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని హరీష్ రావు ఆరోపించారు.