బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు ప్రమాదకారులు
గాడ్సే వారసులను, మోదీని ఓడించాలి.
మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా సిద్దం కావాలి
బ్రిటీషర్లను తరిమినట్లే బిజెపిని దేశం నుంచి తరిమేయాలి..
అహ్మదాబాద్ సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..
‘దశాబ్దాల కల అయిన తెలంగాణను మాకు సోనియా గాంధీ అందించారు.. వల్లభాయ్ పటేల్ భూమి నుంచి నేను ఒక్కటే చెబుతున్నా… సోనియా గాంధీ నాయకత్వంలో మేం బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం. బీజేపీని అడ్డుకుంటాం..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అహ్మదాబాద్ సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మహత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ల గడ్డపై, సబర్మతీ నది ఒడ్డున రెండు రోజులుగా మేధో మథన (చింతన్ బైఠక్) సదస్సు జరుపుకుంటున్నామని, అధికారం చేపట్టిన తర్వాత దేశంలో మోదీ చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకు సబర్మతీ ఒడ్డున ఇక్కడ సమావేశమయ్యామని తెలిపారు. గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రయత్నిస్తున్నామని, గాడ్సే ఆలోచన విధానాన్ని దేశంలో వ్యాపింపజేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు గాంధీ కుటుంబ సభ్యులు, రాహుల్ గాంధీ మిత్రులు, దేశ నలుమూలల ఉన్న ప్రతి ఒక్కరూ మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు.
మోదీ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చారు.. వాటికి వ్యతిరేకంగా రైతులు 14 నుంచి 15 నెలలు ధర్నాలు చేసినా చర్చలకు రాలేదని అన్నారు. మోదీ మణిపూర్లో మంటలు రాజేశారు.. దేశ మూల వాసుల జీవన హక్కును కాలరాసే ప్రయత్నం మోదీ చేశారని విమర్శించారు. మరో వైపు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, కుల గణన, రైతు రుణ మాఫీ, యువతకు ఉద్యోగాల కల్పన, మహిళల సంక్షేమంపై ఆయన వాగ్దానాలు చేశారని చెప్పారు. పాదయాత్రలో భాగంగా తెలంగాణకు వొచ్చినప్పుడు కుల గణన, రైతు రుణమాఫీ, నిరుద్యోగ నిర్మూలన, మహిళల సంక్షేమానికి రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 25 లక్షల కుటుంబాలకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశామన్నారు. మేం తెలంగాణలో కుల గణన చేసి చూపించాం. కుల గణనపై రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడాతారనే భయంతో ఆయనకు లోక్సభలో మోదీ మైక్ ఇవ్వ లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు. 11 సంవత్సరాలు దాటిపోయింది.. ఈ లెక్కన 20 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వాలి. మోదీ, అమిత్ షాకు ఇద్దరికే ఉద్యోగాలు వొచ్చాయి…ప్రతి ఏటా 2 కోట్ల యువకులకు ఉద్యోగాలు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీకి అండగా నిలవాలి..
దేశంలోని మూలమూలన ఉన్న గాంధేయవాదులు మోదీ వ్యతిరేక పోరాటంలో రాహుల్గాంధీకి అండగా నిలవాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. గాంధీ ఆలోచన ధారతో ఉన్న మనమంతా గాడ్సే వారసులను, మోదీని ఓడించాలని కోరారు. రైతులు, యువత, మహిళల కోసం సీడబ్ల్యూసీలో సాగిన చర్చలపై ఆశతో నేను ఇక్కడి నుంచి వెనక్కు వెళుతున్నా… తెలంగాణలో మేం బీజేపీకి అవకాశం ఇవ్వం… గుజరాత్ గడ్డపై నుంచి చెబుతున్నా.. మేం నిజాం ప్రభుత్వం కింద ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో మాకు స్వాతంత్య్రం వొచ్చింది. అందుకే గుజరాత్ ప్రజలతో, వల్లభాయ్ పటేల్ వారసులతో మా తెలంగాణ ప్రజలకు సంబంధం ఉంది… మాకు స్వాతంత్య్రం ప్రసాదించిన వల్లభాయ్ పటేల్తో మాకు హృదయపూర్వకమైన బంధం ఉంది.. మాకు స్వాతంత్య్రం వల్లభాయ్ పటేల్ ఇచ్చారు.. తెలంగాణను మాకు సోనియా గాంధీ అందించింది. వల్లభాయ్ పటేల్ భూమి నుంచి నేను ఒక్కటే చెబుతున్నా… సోనియా గాంధీ నాయకత్వంలో మేం బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం. బీజేపీని అడ్డుకుంటాం.. వారిని ఎవరూ క్షమించరని ముఖ్యమంత్రి అన్నారు.
గాంధీజీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దండి సత్యాగ్రహంతో పాటు 30 ఏళ్ల పాటు అనేక పోరాటాలు చేశారు.. .కానీ బ్రిటిష్వాళ్లు ఎప్పుడూ గాంధీజీ మీద లాఠీ ప్రయోగం చేయలేదు. స్వాతంత్య్రం వొచ్చిన ఆరు నెలల్లోనే గాడ్సే వారసులు గాంధీజీపై తుటా పేల్చి ఆయనను హత్య చేశారు. బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు ప్రమాదకారులని సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. బ్రిటిషర్లను దేశం నుంచి తరిమికొట్టినట్లే రాహుల్ గాంధీ నాయకత్వంలో మనమంతా బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. . మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా సిద్దంగా ఉండాలని, తెలంగాణలో బీజేపీని అడ్డుకునేందుకు, ఓడించేందుకు మేం ఇక్కడి నుంచి ఆశను, ఆదేశాన్ని తీసుకొని వెళుతున్నామన్నారు. . రానున్న రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యతను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, గాంధీ వారసులు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.