Wednesday, September 18, 2024

రాష్ట్రపతికి బీజేపీ ఎమ్మెల్యేల లేఖ.. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన?

ఢిల్లీ మధ్యం కుంబకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు నుంచి దేశ రాజధాని ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీకి మధ్య ఎప్పుడూ మాటల యుధ్దమే కొనసాగుతూ వస్తోంది. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం వెలుగులోకి రావడంతో ఈ ఘర్షణ కాస్తా మరింత ముదిరింది. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆప్ నేతలు గత కొన్నిరోజులుగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి ఆప్ నేతలు మోదీ సర్కార్ పై ఇలాంటి ఆరోపణలు చేయడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తోందని ఢిల్లీ మంత్రి అతిషీ మార్లేనా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించి, తమ ప్రభుత్వాన్ని గద్దె దించే కుట్ర పన్నుతోందని తీవ్రంగా ఫైర్ అయ్యారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కొన్ని నెలలుగా తీహార్ జైల్లో ఉండటంతో ఢిల్లీలో రాజకీయ సంక్షోభం నెలకొందని గతంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు ఒక లేఖ రాశారు. ఆప్ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించిందని, వెంటనే ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని ఆ లేఖలో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్ర హోంశాఖను రాష్ట్రపతి భవనం ఆదేశించినట్లు ఢిల్లీ ప్రతిపక్ష నేత విజేందర్‌ గుప్తా తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ విషయం ఢిల్లీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతికి లేఖ రాయడంపై ఢిల్లీ మంత్రి అతిషీ మార్లేనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్‌ లోటస్‌ ను చేపడుతోందని ఆమె ఆరోపించారు. గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, మణిపుర్‌ లలో ఆపరేషన్ లోటస్‌ను గతంలోనే చూశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే ఆపరేషన్‌ లోటస్‌ను ఢిల్లీలోనూ ప్రారంభించారని, కానీ చివరికి విఫలమైందని పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వాలను కూల్చి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాషాయ పార్టీ లక్ష్యమని అతిషీ మండిపడ్డారు. అంతే కాదు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేజ్రీవాల్‌పై ఢిల్లీ ప్రజలకు అభిమానం ఉందని, ఒకవేళ ఆప్ ప్రభుత్వాన్ని కూలిస్తే ఇప్పుడు బీజేపీకి ఉన్న 8 సీట్లు కూడా రావని, మొత్తం 70 సీట్లు ఆప్‌ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజల కోసం కేజ్రీవాల్‌ మెరుగైన విద్య, వైద్యం, ఎలక్ట్రికల్‌ బస్సులు, ఉచిత ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని మంత్రి అతిషీ మార్లే గుర్తు చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular