-
జూన్ వివాదం
-
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
-
సోనియా గాంధీకి ఆహ్వానంపై రగులుతున్న కాషాయం
జూన్ 2 తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ కీలక నేత సోనియాగాంధీని ఆహ్వానించాలని, సోనియా చేతుల మీదుగా రాష్ట్ర గీతాన్ని విడుదల చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పై వివాదం చోటుచేసుకుంది. అసలు సోనియా గాంధీని ఏ విధంగా ఆహ్వానిస్తారని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ దేవత అయిన సోనియాను ఎందుకు ఆహ్వానించకూడదని కాంగ్రెస్ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య ఈ వ్యవహారం రచ్చగా మారింది. అసలు సోనియాగాంధీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరవుతారో లేదో తెలియదు కానీ , అంతకంటే ముందుగానే ఆమెను ఆహ్వానించడంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.
అసలు సోనియా గాంధీని ఏ హోదాలో ఆహ్వానిస్తున్నారో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 1500 మందిని బలి తీసుకున్నందుకు సోనియాను ఆహ్వానించి సన్మానిస్తారా అని ఆయన కాంగ్రెస్ను నిలదీశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రభుత్వ కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమం అయితే పార్టీ అధినేతను ఎలా ఆహ్వానిస్తారని, పార్టీ కార్యక్రమం అయితే గాంధీభవన్ లో ఘనంగా నిర్వహించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్కు సూచించారు.అయితే, దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా అంటూ ప్రశంసిస్తూ బీజేపీ నేతలపై మండిపడుతున్నారు. సోనియా రాకను తప్పుపడుతున్నారంటే బీజేపీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
నిరసనకు దిగుదామా..?
ప్రస్తుతం రాష్ట్రంలో ఆవిర్భావ వేడుకల నిర్వహణ ఎలా ఉన్నా.. ఇరు పార్టీల మధ్య మాత్రం ఫైట్ నడుస్తున్నది. తెలంగాణ కోసం పార్లమెంట్లో సుష్మ స్వరాజ్ వంటి నేతలు ఒప్పించారని, తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని బీజేపీ చెప్తుండగా.. సోనియా గాందీ ఇస్తేనే రాష్ట్రం వచ్చిందని కాంగ్రెస్ చెబుతున్నది. ఇలాంటి పరిణామాల్లో సోనియా గాంధీ ఈ వేడుకలకు వస్తే నిరసనకు దిగాలని కాషాయ శ్రేణులు ప్లాన్ చేస్తున్నారు. వేల మందిని బలి తీసుకున్న సోనియా.. ఆవిర్భావ వేడుకలకు రావద్దంటూ ముందుగానే హెచ్చరిస్తున్నారు.