అందుకే డీ లిమిటేషన్తో సీట్ల తగ్గింపునకు ఎత్తులు
దక్షిణ భారతంలో బిజెపికి 29 ఎంపి సీట్లే..
ఎక్కడా అధికారంలో లేకపోవడంతో కక్ష తీర్చుకునే యత్నం
డీలిమిటేషన్తో ఉత్తరాది రాష్ట్రాలకు మేలు
మోదీకి ఈడీ, సీబీఐ, ఇన్కం టాక్స్లు అనుబంధ సంఘాలు
ఇండియా టుడే కాన్క్లేవ్లో సిఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవడానికే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎక్కడా అధికారంలో లేమని, రామని తెలుసుకునే ఇలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదిక పేరుతో అన్యాయం చేసేందుకు మోదీ ఎత్తులు వేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు డీలిమిటేషన్ అంశంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్పై తమిళనాడు నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ’ఇండియా టుడే’ నిర్వహించిన కాన్క్లేవ్లో రేవంత్ రెడ్డి శుక్రవారం మాట్లాడారు. ‘దక్షిణాదిలో బిజెపికి తగిన ప్రాతినిధ్యం లేదు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వొచ్చినప్పటికీ.. ఆ పార్టీ సాధించిన 240 లో దక్షిణాదిలో గెలిచింది కేవలం 29 స్థానాలే. దక్షిణాదిలోని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారంలో లేదు.
ఏపీలో జూనియర్ భాగస్వామిగా ఉంది. అందుకే ప్రతీకారం తీర్చుకోవాలని బిజెపి భావిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేకూర్చేలా డీలిమిటేషన్కు సిద్ధమవుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ఆదేశాల మేరకే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమగ్రంగా అమలు చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. మరో 30 ఏళ్లు డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని, అప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా ఏవిధంగా పెరుగుతుందో చూడాలన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రో రేటా విధానంలో సీట్ల పెంపు చేపడితే యూపీలో ప్రస్తుతం ఉన్న 80 సీట్లు 120కి పెరుగుతాయన్నారు. తమిళనాడులో 39 నుంచి 60కి మాత్రమే చేరుతాయని అభిప్రాయపడ్డారు. కేవలం దక్షిణాదిలోనే కాదని ఉత్తరాదిలోని పంజాబ్ వంటి రాష్ట్రాలకు సైతం డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. యూపీ, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి బిమారీ రాష్ట్రాలకు మాత్రమే దీంతో లబ్ది జరుగుతుందని తెలిపారు.
జన గణనతోపాటు కులగణన చేయాలి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలువురు ముఖ్య నేతలను కలవనున్నారు. మరోవైపు.. ‘ఇండియా టుడే‘ మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. మీరు కన్ఫ్యూజ్ అయినట్టే మేము మూడు లక్షల కోట్లే అప్పు అనుకున్నాం.. కానీ లెక్కలు చూస్తే రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని అన్నారు. కేసీఆర్ మూడు లక్షల కోట్ల అప్పే అని చెప్పారన్నారు. తెలంగాణలో 21 వేల కోట్లు రైతులకు రుణమాఫీ.. మూడు నెలల్లో చేసింది తమ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. సౌత్ ప్రాతినిధ్యం తగ్గించే పనిలో బీజేపీ ఉందని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణకు సౌత్ ఇండియా ప్రజలు కట్టుబడి ఉన్నారు.. ఇప్పుడు జనాభా ప్రకారం నియోజక వర్గాల విభజన అంటే ఎలా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ జన గణన చేస్తున్నారు.. దాంట్లో కుల గణన కూడా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తాం అంటున్నామని చెప్పారు.
భాషను బలవంతంగా రుద్దొద్దు..
భాషను బలవంతంగా రుద్దొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ.. రెండో భాష తెలుగు అని చెప్పారు. సివిల్స్లో తెలుగుని తొలగించారని తెలిపారు. కాంగ్రెస్ కు యూత్ కాంగ్రెస్.. మహిళా కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఉన్నాయని వెల్లడించారు. కానీ మోదీకి ఈడీ, సీబీఐ, ఇన్కం టాక్స్లు అనుబంధ సంఘాలని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఎక్కువ.. అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి వాళ్లను పక్కన పెడితే సైలెంట్గా ఉన్నారు.. తమ పార్టీలో రాజ్యసభ సీటు ఒక్కసారి ఇవ్వకపోతే జంతర మంతర్ లో ధర్నా చేస్తారు. అంత ప్రజాస్వామ్యం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలోనేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీలో అది సాధ్యమేనా అని ప్రశ్నించారు. అదానీ 100 కోట్లు వెనక్కి ఇవ్వాలని పార్టీ చెప్పలేదు.. తాను భద్రాచలంలో రాముడి గుడి ఉందని చెప్పా.. మోదీ, అమిత్ షాలను పిలిచా ఇప్పటివరకు రాలేదన్నారు. మరోవైపు.. హైదరాబాద్లో ఒలింపిక్స్ నిర్వహించండి అని తాను లేఖ రాశానని తెలిపారు. అహ్మదాబాద్ కంటే తమ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.