టీఎస్, న్యూస్:ఓయో హోటల్లో బస చేసిన ప్రేమజంట విషయంలో విషాదం చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్ (28) ఇటుకల వ్యాపారి. అతనికి అదే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతితో ఏడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా రాను రాను ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి సోమవారం హైదరాబాద్లో ఓ వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఎస్ఆర్ నగర్లోని ఓయో టౌన్ హౌస్లో ఒక గది తీసుకుని బస చేశారు.
రాత్రంతా మద్యం తీసుకున్న హేమంత్ తెల్లవారుజామున 2 గంటల సమయంలో వాష్ రూమ్కి వెళ్లాడు. ఎంతకూ బయటకు రాకపోవడంతో సదరు యువతి ఏ జరిగిందోనని వెళ్లి చూడగా హేమంత్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. యువతి వెంటనే హేమంత్ స్నేహితులకు సమాచారం అందిచింది. వారు వచ్చి హేమంత్ను మంచంపై పడుకోబెట్టి అంబులెన్స్కు కాల్ చేశారు. అయితే అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి అప్పటికే హేమంత్ మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ హేమంత్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.