- రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరింత అప్పులపాలు
- ఈఆర్సీ ఆమోదం లేకుండా చెల్లింపులు
- ప్రజలను తప్పుదారి పట్టించిన గత ప్రభుత్వం
ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా రూ.6 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. ఈ విద్యుత్ కొనుగోళ్లతో తెలంగాణ విద్యుత్ సంస్థలు అంచనాలకు మించి నష్టపోయాయని ప్రభుత్వం లెక్కలు పేర్కొంటున్నాయి. ఒప్పందం ప్రకారం ఒక్క యూనిట్ ధర రూ.3.90 మాత్రమే అని గత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఒక్కో యూనిట్ ఖర్చు రూ.5.64 ఖర్చయినట్టుగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. ఈ విద్యుత్ కొనుగోళ్లతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరింత అప్పులపాలయ్యాయని ప్రభుత్వం తెలిపింది. ఛత్తీస్గడ్ నుంచి ఇప్పటివరకు మనం కొన్న విద్యుత్ 17,996 మిలియన్ యూనిట్లు కాగా, ఇప్పటివరకు చేసిన చెల్లింపులు రూ.7,719 కోట్లుగా విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్గడ్కు చెల్లించాల్సిన బకాయిలు రూ.1,081 కోట్లు కాగా, ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు రూ.1362 కోట్లను కూడా లెక్కిస్తే ఒక్కో యూనిట్ ఖర్చు రూ.5.64 ఖర్చయినట్టుగా అధికారులు తెలిపారు.
వడ్డించిన ఛార్జీలతో రూ.3,110 కోట్ల అదనపు భారం
ఈ లెక్కన గత ప్రభుత్వం చెప్పిన రేటు కంటే వడ్డించిన ఛార్జీలతో దాదాపు రూ.3,110 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడిందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. బకాయిల విషయంలోనూ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఇంకా తేలలేదు. కేవలం రూ.1,081 కోట్ల బకాయిలున్నట్లు తెలంగాణ చెబుతుండగా రూ.1,715 కోట్లు బకాయిలున్నట్లు ఛత్తీస్ గఢ్ విద్యుత్ సంస్థలు లెక్క చూపుతున్నాయి. బకాయిల వివాదంపై ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ అప్పీలేట్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయడం విశేషం.
బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లతో రూ.2,083 కోట్ల భారం
ఛత్తీస్గఢ్ విద్యుత్ 2017 చివరినుంచి అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా అరకొరగానే విద్యుత్ను ఛత్తీస్గఢ్ సరఫరా చేస్తోంది. ఎన్నడూ వెయ్యి మెగావాట్లు సాఫీగా చేయలేదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అక్కడి నుంచి ఆశించిన సరఫరా తగ్గిపోవటంతో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే 2017 నుంచి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వంపై పడిన అదనపు భారం రూ.2,083 కోట్లుగా అధికారులు తెలిపారు.
పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని పిజిసిఐఎల్ డిస్కంలకు నోటీసులు
అయితే 2022 ఏప్రిల్ నుంచి ఛత్తీస్గఢ్ విద్యుత్ను సరఫరా నిలిపివేసింది. మరోవైపు ఛత్తీస్గడ్ నుంచి విద్యుత్ను తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పిజిసిఐఎల్) తో 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు కారిడార్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ కారిడార్ కూడా విద్యుత్ సంస్థల కొంప ముంచింది. బుకింగ్ ఒప్పందం ప్రకారం విద్యుత్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పిజిసిఐఎల్కు సరఫరా ఛార్జీలు కట్టాల్సిందే. ఈ నేపథ్యంలోనే విద్యుత్ను వాడకున్నా కట్టిన అదనపు ఛార్జీలు రూ.638 కోట్లుగా తేలింది. దీనికి తోడు గత ప్రభుత్వం నిర్లక్షంతో కారిడార్ల బుకింగ్ తో అదనపు నష్టం వాటిల్లిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
కేవలం 1000 మెగావాట్ల కారిడార్ సరిపోతుండగా అనవసరంగా మరో 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అడ్వాన్సుగా కారిడార్ బుక్ చేసింది. ఛత్తీస్గడ్ విద్యుత్ లభించే అవకాశం లేదని ఈ కారిడార్ను అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. ఈలోగా జరగాల్సినంత నష్టం జరిగింది. పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని పిజిసిఐఎల్ డిస్కంలకు నోటీసులు జారీ చేసింది. అవగాహన లేకుండా చేసుకున్న కారిడార్ ఒప్పందం చేసుకోవటంతో ఈ సమస్య తలెత్తింది. ఈ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందానికి ఇప్పటివరకు తెలంగాణ ఈఆర్సీ ఆమోద ముద్ర వేయలేదు. ఈఆర్సీ ఆమోదం లేకుండా ఛత్తీస్గఢ్కు చెల్లించిన వేల కోట్ల రూపాయలను అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాలని విద్యుత్ శాఖ ఇంజనీర్లు, ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.