•రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చింది బీఆర్ఎస్..
•వడ్డీలు కడుతూ దశలవారుగా ఇచ్చిన హామీలు అమలు..
•వనపర్తి లో 721 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు…
: రాష్ట్ర అబ్కారి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ఎస్ఎల్బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ లేదని రాష్ట్ర అబ్కారి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమ ర్శించారు. గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచెత్తడంతో, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు అన్ని పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి బాధితులను కాపాడడం కోసం నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సహా 11 సంస్థలను రప్పించి బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
టన్నెల్ లో 11.8 కిలోమీటర్లలోనికి తాను కూడా వెళ్లానని, అక్కడ భయానక పరిస్థితి నెలకొందన్నారు. దేశంలోని వివిధ సంస్థల ద్వారా నిష్ణాతులను పిలిపించి సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. సీఎం ఘటన స్థలికి రాకపోయినప్పటికీ ప్రతి రోజూ సహాయ కార్యక్రమాలపై సమీక్షిస్తున్నారన్నారు. వనపర్తిలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి వనపర్తికి రాబోతున్నారని, తాను చదివిన పాఠశాల అభివృద్ధి సహా రూ.721 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపాన చేయబోతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి 14 నెలల్లో విద్యా, వైద్య, క్రీడల పరంగా సుమారు రూ.1000 కోట్ల అభివృద్ధి పనులను వనపర్తికి తెప్పించగలిగారన్నారు.
జాబ్ మేళా, రుణమేళా, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారని, సుమారు వెయ్యి మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించే పని చేస్తున్నారన్నారు. మొదటి సారి శాసనసభ్యులు అయినప్పటికీ నిత్యం ప్రజలతో ఉంటూ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ సీఎం గా పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తాను చదువుకున్న ఊరికి తొలిసారి రానున్నారని తెలిపారు. 14 నెలల కాలంలో వనపర్తిలో రూ.397 కోట్లతో అభివృధ్ది కార్యక్రమాలకు సహకారం అందించారన్నారు. మార్చి 2న రూ.721 కోట్లలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నారని చెప్పారు. వనపర్తిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ధికి రూ.1 కోటితో, శంకుస్థాపన చేయనున్నారన్నారు. రూ.257 కోట్లతో హాస్పిటల్ నిర్మాణానికి, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు.
రూ.60 కోట్లతో తాను చదువుకున్న జడ్పీ స్కూల్, జూనియర్ కళశాల అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారన్నారు. రూ.22 కోట్లతో ఐటీ టవర్ కు, రూ. 81 కోట్లతో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి, రాజనగరం నుంచి పెద్దమందడి రోడ్డుకు రూ.40 కోట్లతో శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ సీఎం వనపర్తిలో చదువుకున్న నేపథ్యంలో, ఆయనకు ఇక్కడి ప్రాంతంలో మంచి అనుబంధం ఉన్న కారణంగా వనపర్తి అసెంబ్లీ అభివృద్ధి కోసం రూ.721 కోట్లతో శంకుస్థాపనలు చేయబోతున్నారన్నారు. సీఎం రేవంత్ ఆయనతో చదువుకున్న వారందరితో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొననున్నారన్నారు. ఆయన ఇక్కడి ఉన్నప్పుడు పార్వతమ్మ అనే వారి ఇంట్లో ఉండి చదవుకున్నారని, వారి ఇంటికి కూడా సీఎం రాబోతున్నారన్నారు.ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డిసిసి రాజేంద్రప్రసాద్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.