* అటూ.. ఇటూ..!!
* బీఆర్ఎస్ ఖాతా నుంచి జిల్లాలు ఖాళీ
* కొంతమంది కాంగ్రెస్.. మరికొందరు టీడీపీ
* చంద్రబాబు రాకతో మలుపు
రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. నేతల ఫిరాయింపులతో సరికొత్త సమీకరణలకు తెర తీస్తున్నారు. ఈ పరిణామాలు నూతన రాజకీయ సమీకరణలకు నాంది పలుకుతున్నాయి. అదే సమయంలోరాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలు రోజురోజుకు తమ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకుంటుపోతున్నాయి. దీంతో గత పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని శాసించిన బీఆర్ఎస్ పార్టీ…..ప్రస్తుతం ఈ చర్యలతో కుదేలవుతోంది. ఆ పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా ఇతర పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీకి చెందిన ఎంఎల్ సీలు, ఎంఎల్ఎలు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఏడుగురు శాసనసభ్యులు, ఆరు మంది ఎంఎల్ సీలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అదే దారిలో వెళ్లేందుకు మరికొందరు ఎంఎల్ఎలు, ఎంఎల్ సీలు సిద్ధంగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గులాబీ పార్టీ ఖాళీ అవుతోంది.
తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎంఎల్ సి వెంకట్రామిరెడ్డి సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అలాగే అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఎంఎల్ఎ అజేయుడు కూడా ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ చేరడం ఖాయమని తెలుస్తోంది. వీరే కాకుండా మరో డజన్ మంది వరకు ఎంఎల్ఎలు, ఎంఎల్ సీలు అధికార కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మిగిలిన వారిలో కొందరు బీజేపీలో చేరేందుకు యత్నిస్తున్నారు.వారిలో ప్రస్తుతం ఐదు మంది శాసనసభ్యులు ప్రస్తుతం రెఢీ ఉన్నారని తెలుస్తోంది. అయితే ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసిన తరువాతనే పార్టీలో చేరాలన్న నిబంధనలతో కొంతమంది బీఆర్ఎస్ ఎంఎల్ఎలు బీజేపీలో చేరేందుకు తటాపటాయిస్తున్నారని తెలుస్తోంది.
తాజాగా కాంగ్రెస్, బీజేపీలను కాదని మరి కొందరు టీటీడీపీలో చేరాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే గులాబీ పార్టీకి చెందిన శాసనసభ్యులు ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీలు రెండు రోజుల క్రితం ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవడం రాజకీయవర్గాల్లో ఒక్కసారిగా హీటును పెంచాయి. ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం కానుందని తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని భావిస్తున్న వారికి ఇది మరింత టెన్షన్ పెడుతోంది. మరిముఖ్యంగా గులాబీ పార్టీకి చెమటలను పట్టిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీలోని కీలక నేతలంతా టీటీపీ నుంచి వచ్చిన వారే కావడం విశేషం. వారితోనే టీడీపీ శ్రేణులు సైతం గులాబీ పార్టీలో చేరిపోయారు. దీంతో రాష్ట్రంలో గులాబీ పార్టీ మరింత బలపడింది. అయితే ఇదంతా నిన్నటి వరకు. ప్రస్తుతం ఏపీలో బంపర్ మెజార్టీతో ఘన విజయం సాధించి….ఆ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని చేపట్టింది. అలాగే కేంద్రంలో కూడా టీడీపీ అండతోనే మోడీ సర్కార్ కొనసాగుతోంది. దీంతో కేంద్రంలో బాబుకు మరింత ప్రాధాన్యత పెరిగింది.
అదే సమయంలో తెలంగాణలో గులాబీ పార్టీ రోజురోజుకు పలుచపడుతున్న సమయంలో టిటీడీపీకి పూర్వ వైభవం తీసుకవచ్చేందుకు ఇదే సరైన సమమని భావిస్తున్న చంద్రబాబు గత రెండు రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేశారు. దీంతో బీఆర్ఎస్ లోని పలువురు నేతలు చంద్రబాబుతో మంతనాలు సాగించారని తెలుస్తోంది. కొందరు తెరచాటుగా చర్చలు జరపగా…మరి కొందరు డైరెక్టుగానే బాబును కలిశారు. ఈ పరిణామాలను చూస్తుంటే…. తెలంగాణాలో త్వరలోనే టీటీడీకి పూర్తి స్థాయిలో జవసత్వాలు తీసుకరావాలని చంద్రబాబు తన మాస్టర్ మైండ్ కు పనిచెప్పినట్లుగా రాజకీయ సర్కిళ్లలో వినిపిస్తోంది. దీంతో త్వరలోనే బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.
దీంతో గులాబీ నేతలంతా మూడు ముక్కల మాదిరిగా మూడు పార్టీలోకి జంప్ చేయడం తథ్యంగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీని వీడిన పాత నేతలంతా తిరిగి సొంత గూటికి రావాల్సిందిగా బహిరంగంగానే విజ్ఞప్తి చేసింది. దీంతో గతంలో పలు కారణాలతో పార్టీని వీడిన నేతలంతా మళ్లీ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. త్వరలోనే వారంతా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తంగా ఒక్క ఓటమి రాష్ట్రంలో గులాబీ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితికి వచ్చినట్లు కనబడుతోంది.