- 14 నెలలకాలంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
- ప్రజా శ్రేయస్సు కోసం మరింతగా పోరాడుదాం…
- ఏప్రిల్ 27న వరంగల్లో లక్షలాది మందితో వరంగల్లో భారీ బహిరంగ సభ
- తెలంగాణ సమాజం గర్వించేలా బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు
- బిఆర్ఎస్ తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ
- ఎర్రవెల్లిలో బిఆర్ఎస్ ముఖ్య నేతలతో బిఆర్ఎస్, మాజీ సీఎం అధినేత కేసీఆర్
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వొస్తున్న బిఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని, ఈ విషయం గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని, అందుకు తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, అనిశ్చితే నిదర్శ నమని బిఆర్ఎస్ అధినేత, మాసీ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల్లో భాగంగా.. వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం జరిగిన కీలక సమావేశంలో ఇందుకు సంబంధించి సుదీర్ఘ చర్చ జరిగింది.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని, అనంతరం పదేండ్ల పాటు ఎంతో అప్రమత్తతతో తెలంగాణ స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని, అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం నేడు కష్టాల్లో ఉందన్నారు. ఇటువంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు, కేవలం బిఆర్ఎస్ పార్టీకే పరిమితం కాదని యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. ‘‘ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ… ప్రజలు బిఆర్ఎస్ను తెలంగాణ పార్టీ గా తమ సొంత ఇంటి పార్టీ గా భావిస్తారు. ప్రజలు నేడు అనేక కష్టాల్లో ఉన్నారు. వారి రక్షణ బిఆర్ఎస్ పార్టీనే అని నమ్ముతున్నారు.’’ అని తెలిపారు. కాంగ్రెస్ ఆశ పెట్టిన గ్యారెంటీలను వాగ్దానాలు నమ్మిన ప్రజలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని, ఇక ఎప్పుడు ఎన్నికలు వొచ్చినా బిఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని సమావేశంలో ఆశాభావం వ్యక్తమైంది. కాగా బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజకవర్గాల వారీగా నిర్వహించాలని అందుకు త్వరలో కమిటీలను వేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు. వరంగల్ బహిరంగ సభ అనంతరం…పార్టీనీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ట పరిచి, కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్టు అధినేత తెలిపారు. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
వర్తమాన రాజకీయ పరిస్థితులపై చర్చ
రాష్ట్రం తో పాటు, దేశంలో నడుస్తున్న వర్తమాన రాజకీయ పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. అందుకనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు అమలుచేయాల్సిన రాజకీయ ఎత్తుగడలపై లోతుగా చర్చించారు. గత ఒడిదుడుకులను అనుభవాలను పరిగణలోకి తీసుకుని వాటిని విశ్లేషిస్తూ, వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తు కు బాటలువేసుకునే విధంగా కార్యాచరణను అమలు పరచాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వమున్నకూడా ,తెలంగాణ సమాజానికి మొదటి నుంచీ అవి వ్యతిరేకంగానే పని చేస్తున్నాయని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం లో పార్టీ నీ పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తత తో వుండాలని సమావేశం భావించింది.
తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిథ్యం పార్లమెంట్ లో లేకపోవడం వలన తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని అంశంపై చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ప్రజలకు మరింతగా అర్థం చేయించి పార్లమెంట్ లో బిఆర్ఎస్ ఎంపీలు ప్రాతినిథ్యం ఉండి రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా పలు అంశాలపై చర్చ సందర్బంగా అధినేత అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు వారి వారి అభిప్రాయాలను అధినేత ముందుంచారు. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చలో.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పికొడుతూ తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ అధ్యక్షతన సాగిన సమావేశం నిర్ణయించింది.