- మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే జిల్లాల్లో బిఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణం
- ఎల్బీనగర్ ఆస్పత్రి స్థలానికి ఎన్ఓసి లేకుండా గత ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభం
- గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు తప్ప అభివృద్ధి జరగలేదు
- కేకే మహెందర్ రెడ్డిని బిఆర్ఎస్ నుంచి కెటిఆర్ వెళ్లగొట్టారు
- వచ్చే నెల 6 నుంచి 8వ తేదీ వరకు శ్రీధర్ బాబుతో కలిసి విదేశాలకు వెళ్లి వివిధ కంపెనీలతో భేటీ అవుతాం
- రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఎన్నికల ఫలితాల తరువాత బిఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందని బిఆర్ఎస్లో కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావులు తప్ప ఏ ఒక్కరూ ఉండరని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఎంపి ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సీన్ మొత్తం మారుతుందన్నారు. ఫలితాల తర్వాత బిఆర్ఎస్ నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వెంటపడి కొడతారని మంత్రి కోమటి రెడ్డి ఆరోపించారు. గురువారం మంత్రి కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే జిల్లాల్లో బిఆర్ఎస్ కార్యాలయాలు నిర్మించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ పోతోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం అప్పుల ఖజానా మాత్రమే ఇచ్చిందని ఆయన అన్నారు. అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని గత ప్రభుత్వాన్ని కోరామని, ఆడిటోరియానికి కాళోజీ పేరు పెట్టాలని కూడా చెప్పామని ఆయన వెల్లడించారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 9 నుంచి 12 సీట్లు
ప్రభుత్వ ఆస్పత్రుల భవనాలు 14 అంతస్థులు మించరాదని నిబంధనలు చెబుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఎల్బీనగర్ ఆస్పత్రి స్థలానికి ఎన్ఓసి లేకుండా గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందని ఆయన ఆరోపించారు. అవినీతి చేయకుండానే ఎమ్మెల్సీ కవితపై 8 వేల పేజీల ఛార్జిషీట్ను అధికారులు దాఖలు చేశారా అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర సంపద అంతా దోచుకున్నది చాలక కెసిఆర్ కుటుంబం ఢిల్లీకి వెళ్లిందని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో 9 నుంచి 12 సీట్లు వస్తాయని, బిఆర్ఎస్కు రెండు, మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువని ఆయన ఎద్దేవా చేశారు.
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని చెప్పలేదు
గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు తప్ప అభివృద్ధి జరగలేదని మంత్రి ఆరోపించారు. ఐఏఎస్లను అందరినీ పక్కన పెట్టి కేవలం నలుగురినే కెటిఆర్ ప్రోత్సహించారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. ఉద్యమకారుడు కేకే మహెందర్ రెడ్డిని బిఆర్ఎస్ నుంచి కెటిఆరే వెళ్లగొట్టారని ఆయన ఆరోపించారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని ఎక్కడా చెప్పలేదని, పేదలకు సన్న బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే బోనస్ ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నెల 6 నుంచి 8వ తేదీ వరకు శ్రీధర్ బాబుతో కలిసి విదేశాలకు వెళ్లి వివిధ కంపెనీలతో భేటీ కానున్నట్టు ఆయన పేర్కొన్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు కొత్త దుకాణం…
సిఎం రేవంత్ రెడ్డికి భయపడి కెసిఆర్ అసెంబ్లీకి రాలేదని మంత్రి ఆరోపించారు. బిఆర్ఎస్ శాసనసభా పక్ష నేత బాధ్యత మాజీ మంత్రి కెటిఆర్కు ఇస్తే మాజీ మంత్రి హరీశ్ రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచనలో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బిసి సొరంగం మంజూరు చేయిస్తే బిఆర్ఎస్ ప్రభుత్వం దానిని నిలిపివేసిందని మంత్రి కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హోంమంత్రి మహమూద్ అలీకి సిఎం క్యాంపు కార్యాలయంలోనికి అనుమతి ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. వేసవిలో వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే రైతులకు రూ.1,500 కోట్ల పరిహారం చెల్లించామని ఆయన పేర్కొన్నారు.
సిఎంపై కెటిఆర్ మాటలు అసహ్యం….
పదవి పోవడంతో పాటు చెల్లి కవిత జైలుకు పోయిందన్నా ఆవేదనలో కెటిఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎంపై కెటిఆర్ మాటలు అసహ్యంగా ఉన్నాయన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం రేవంత్ రెడ్డి చేసిన తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ఇండిపెండెంట్ జెడ్పీటిసిగా గెలిచి ప్రజల కోసం పోరాడి ఈ స్థాయికి రేవంత్రెడ్డి వస్తే తండ్రిని అడ్డం పెట్టుకొని కెటిఆర్ రాజకీయాల్లోకి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు మేం ఇచ్చాం అని కెటిఆర్ అంటున్నాడు, బిఆర్ఎస్ హయాంలో కెసిఆర్ ఫాంహౌస్లో పడుకుంటే మీరే కదా డిక్టేటర్ ముఖ్యమంత్రిగా వ్యవహారించారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. అప్పుడు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేక పోయారని కెటిఆర్ను మంత్రి ప్రశ్నించారు.
హైదరాబాద్కు పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్
హైదరాబాద్కు పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని బిఆర్ఎస్ సర్వనాశం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పులు ఖజానా మాత్రమే ఇచ్చిందని ఆయన ఆరోపించారు. తాము ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయబోతున్నామని దీనిపై బిఆర్ఎస్కు భయం పట్టుకుందని, ఎన్నికల తర్వాత పార్టీ ఉండదని తెలిసి బిడ్డ బెయిల్ కోసం ఓపెన్గా బిజెపికి బిఆర్ఎస్ మద్దతు తెలిపిందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ మాదిరిగా బిఆర్ఎస్ కుప్పకూలడం ఖాయమని జూన్ 6వ తేదీ తర్వాత ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఉండరని ఏ కార్యకర్తలు కూడా పార్టీని వదిలేస్తారని ఆయన ఎద్దేవా చేశారు.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి…
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత బిఆర్ఎస్ నాయకులు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వారి నాయకులే వారిని కొడతారని, జూన్ 5వ తేదీ తర్వాత వారు కేఏ పాల్ మాదిరిగా వారు కూడా తిరగాల్సిందేనని ఆయన అన్నారు. తీన్మార్ మల్లన్నపై కేసులు ఉన్నాయని కెటిఆర్ విమర్శిస్తున్నారని, బిజెపి నుంచి వచ్చిన వ్యక్తిని ఇంద్రుడు చంద్రుడు అంటూ కెటిఆర్ పొగుడుతున్నారని, మరీ కవితపై 8 వేల పేజీలతో చార్జీషీట్ వేశారని దీన్నేమంటారో కెటిఆర్ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.మీ దోపిడీని బయట పెట్టినందుకే తీన్మార్ మల్లన్నపై బిఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. మందకృష్ణ మాదిగ మాట్లాడితే ఆయన్ను కూడా జైల్లో పెట్టారని ఆయన విమర్శించారు.
రేవంత్కు భయపడి కెసిఆర్ అసెంబ్లీ రాలేదు….
ఆలస్యంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం మా ఓటమికి కారణం అని కెటిఆర్ అంటున్నారని అవన్నీ తప్పుడు ఆరోపణలేనని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. 2019 నుంచి ఏనాడు ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు వేయలేదని ఆయన అన్నారు. కానీ, తాము మార్చి, ఏప్రిల్ లో మొదటి తేదీనే జీతాలు వేశామన్నారు. రేవంత్ రెడ్డికి భయపడి అసెంబ్లీకి రాని కెసిఆర్ కర్రపట్టుకొని తిరుగుతూ బిజెపికి ఓట్లు వేయించారని ఆయన ధ్వజమెత్తారు. ధర్నా చౌక్ ఎత్తివేశారని, టెట్కు రూ.2 వేల ఫీజు వసూలు చేశారని అడుగుతున్న కెటిఆర్, వైన్స్షాప్ టెండర్లపై రూ.2 లక్షలు నాన్ రీఫండబుల్ వసూలు చేసింది ఎవరని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.
ప్రభుత్వంపై 70 ఆర్టీఐ లెటర్లు పెట్టారు…
బిజెపి ఫోర్ లీడర్ అయి నెల రోజులు కాకుండానే ఆర్టీఐ కింద ఏలేటి మహేశ్వర్ రెడ్డి 70 లెటర్లు పెట్టారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. సీనియర్ నేత రాజాసింగ్కు కాదనీ, ఏ పైరవీ చేసి ఎల్పీ పదవి తెచ్చుకున్న ఆ వ్యక్తి తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన పేరు చెప్పాలంటేనే తనకు అవమానంగా ఉందని అలాంటి వ్యక్తి ఆర్ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ పేరుతో సిఎం రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చి మూడునెలలు అయ్యిందని అంతలోనే ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు.