Tuesday, March 18, 2025

బీఆర్‌ఎస్‌లో తీన్మార్‌..?! అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్‌తో మల్లన్న ముచ్చట్లు

మొన్నటిదాకా ఉప్పూ.. నిప్పులా ఉన్న రెండు వర్గాలు ఇప్పుడు ఒక్కటై ముచ్చట పెట్టాయి. నిజానికి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. మిత్రులు ఉండరు. ఎప్పుడు, ఎప్పుడు, ఏ పార్టీ వైపు జంప్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తాము ప్రత్యర్థులం అంటూనే దుమ్మెత్తిపోసుకుని.. మరుసటి ఆ పార్టీ నేతలతో కలిసి తిరగడం కనిపిస్తోంది. తాజాగా సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీ బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్, హరీష్‌రావుతో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ముచ్చటించుకున్నారు. అయితే, ఈ భేటీ వెనుక కారణమేంటి? అనేదే ఇప్పుడు అసలు చర్చ.
సోమవారం తెలంగాణ అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. బిల్లు పెట్టిన కొద్ది‌సేపటికి అసెంబ్లీ లాబీల్లో బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. బీసీల బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా తెరవెనుక పావులు కదుపు తున్నారాయన. ఢిల్లీ వేదికగా బీసీ నేతలు చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాలని కేటీఆర్, హరీష్‌రావులను ఆయన కోరినట్టు తెలుస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ బిల్లు విషయంలో క్రెడిట్ తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారు మల్లన్న. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరి మల్లన్నకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా? బీసీల ధర్నాను తమ వైపు తెచ్చుకునేందుకు ప్లాన్ వేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
శనివారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మల్లన్న మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కులగణన సర్వే విషయానికి తాను వెళ్లాలని అనుకోవడం లేదన్నారు. ప్రభుత్వ లెక్కలను తాను గౌరవిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం లెక్కల ప్రకారమే 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు మల్లన్న. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలిపారు తీన్మార్ మల్లన్న. ఈసందర్భంగా ఉద్యోగుల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రిని కోరారు. తీన్మార్ మల్లన్న విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు రిటైర్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులు పూర్తి చేస్తామన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి పాటు కేసీఆర్, బీజేపీ నేతలు చొరవ చూపాలంటూ విజ్ఞప్తి చేశారాయన. ఈ క్రమంలో మల్లన్న బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారని అంటున్నారు. ఈ లెక్కన మళ్లీ కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు మల్లన్న ఈ విధంగా స్కెచ్ వేసినట్టు కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com