దేశంలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు హైదరాబాద్ వరకు విస్తరించబోతుంది. దేశంలోని పలు కీలక నగరాలను కలుపుతూ నిర్మిస్తున్న ప్రాజెక్టులో భాగంగా.. హైదరాబాద్లోనూ బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. ఈ బుల్లెట్ రైలు నిర్మాణం పూర్తి అయితే.. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలకు మరింత వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రాబోతుంది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ఈ కీలక అడుగు పడింది. హైదరాబాద్-ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ బుల్లెట్ రైలు కారిడార్ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది. దీంతోపాటు మైసూరు-చెన్నై మధ్య నిర్మించాలని నిర్ణయించిన హైస్పీడ్ రైలు కారిడార్ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఈ ప్రాజెక్టు ప్రాథమిక డీపీఆర్ను సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కు పంపించింది.
ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే.. కేవలం రెండు గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే..
హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు మధ్య ప్రయాణ దూరం బాగా తగ్గబోతుంది. ప్రస్తుతం దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గాన్ని ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. జపాన్ సంస్థ టెక్నాలజీ, ఆర్థిక సాయంతో ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ను రైల్వే శాఖ నిర్మిస్తున్నారు. ఈ ముంబై-అహ్మదాబాద్ మార్గంలో జపాన్ తయారు చేసిన బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది.
హైస్పీడ్ రైల్ కారిడార్లు
ఆ తర్వాతి దశలో మరిన్ని హైస్పీడ్ రైల్ కారిడార్లను దేశంలో నిర్మించేందుకు రైల్వే శాఖ తీవ్ర కసరత్తులు మొదలు పెట్టింది. ఇందులో హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు మార్గాలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను ఎలివేటెడ్, అండర్గ్రౌండ్ మార్గాల్లో నిర్మించనున్నట్లు సమాచారం. హైదరాబాద్-బెంగళూరు నగరాల మధ్య దూరం 618 కిలోమీటర్లు కాగా.. సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణిస్తే ప్రయాణ సమయం 11 గంటలు ఉంటుంది. అదే వందే భారత్ రైలులో వెళ్తే ఎనిమిదిన్నర గంటల్లో చేరుకోవచ్చు. కానీ.. ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే మాత్రం.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకునే వెసులుబాటు లభిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అలాగే హైదరాబాద్-చెన్నై మధ్య దూరం 757 కిలోమీటర్లు కాగా.. సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో అయితే 15 గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే మాత్రం రెండున్నర గంటల్లోనే హైదరాబాద్ నుంచి చెన్నైకి చేరుకోవచ్చు.