-
ప్రచారం పరిసమాప్తం
-
తెలుగు రాష్ట్రాల్లో మూగబోయిన మైకులు
-
ఫినిషింగ్ టచ్ ఇచ్చిన అగ్రనేతలు
-
పోలింగ్పై ఈసీ ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు బహిరంగ ప్రచారం బంద్ అయింది. ఆఖరి రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల నేతలు పర్యటించారు. తెలంగాణలో పార్లమెంట్, ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రానున్న 72 గంటలు చాలా కీలకమని ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు ఉధృతంగా ప్రచారం చేశారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కి ఆఖరి రోజు ప్రయార్టీ ఇచ్చి ముగించారు.
అగ్రనేతల ఫినిషింగ్ టచ్
తెలుగు రాష్ట్రాల్లో ఆయా పార్టీల అగ్రనేతలు ప్రచారం చేశారు. ఆఖరి రోజు కావడంతో.. సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా పాల్గొన్నారు. రెండు సభల్లో పాల్గొన్న ఆయన బీజేపీకి మద్దతు ఇవ్వవల్సిందిగా ప్రజలను కోరారు. చేవెళ్ల నియోజకవర్గం వికారాబాద్ లో, మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం వనపర్తిలో అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రచారం నిర్వహించనున్నారు. అటు ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించారు.
ఇదిలా ఉంటే ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాండూరు బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పాలనను వివరించి ప్రచారం చేశారు. అలాగే, కడపలో రాహుల్ గాంధీ పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇడుపులపాయకు వెళ్లి, వైఎస్ఆర్ ఘాట్లో వైఎస్ సమాధికి నివాళులు అర్పించారు. కడప నగరంలోని బిల్టప్ సర్కిల్ వద్ద పుత్తా ఎస్టేట్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈసీ ఆదేశాలు..
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో రాష్ట్రాల్లో నిశబ్ద రాజకీయ వాతావరణం నెలకొన్నది. శనివారం సాయంత్రం 6 తరువాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించకుడదని, రోడ్ షోలు, సభలు, సమావేశాలు, సామాజిక మాధ్యమంలో ప్రచారాలు, పత్రికా ప్రకటనలు అన్నీ ముగించాలని, అలాగే సాయంత్రం 6 తర్వాత స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండకూడదని ఈసీ ఆదేశాలిచ్చింది. బల్క్ ఎస్ఎంఎస్ లపై కూడా నిషేధం ఉంటుందని ఎన్నికల అధికారులు చెప్పారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియ పూర్తి అయిందని, అభ్యర్థి పేరు, పార్టీ పేరు, పార్టీ గుర్తు లేకుండా ఉన్న ఓటర్ స్లిప్పులను మాత్రమే పంపిణీ చేసినట్లు ఈసీ ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. పోలింగ్ కు కేవలం కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉండటంతో ఇవాళ, రేపు తనిఖీలు మరింత ముమ్మరంగా చేపట్టుతున్నామని తెలిపారు. ప్రచారం ముగియగానే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతుండటంతో ఎన్నికల కమిషన్ అప్రమత్తంగా ఉందని, ప్రలోభాలు, హింసాత్మక ఘటనలపై చివరి 72 గంటలు నిఘా పెంచాలని జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఎన్నికల అధికారులు, పోలీసులతో పాటు పరిశీలకులు ఆకస్మిక సోదాలు చేపట్టాలని సీఈవో వికాస్రాజ్ ఆదేశించారు.
కాగా, తెలంగాణలో సాయంత్రం 6 గంటలతో ప్రచారానికి తెరపడగా.. తీవ్రవాద ప్రాబల్యమున్న 5 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ సెగ్మెంట్ పరిధిలో సాయంత్రం 4 గంటలకే ప్రచారం పూర్తి చేశారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముంగించినట్లు ఈసీ ప్రకటించింది.
అంతా జాగ్రత్త
ఎన్నికల్లో ప్రధానంగా డబ్బు, మద్యం పంపిణీ ఎక్కువగా జరిగే బస్తీలు, మురికి వాడలపై రాత్రి వేళల్లో తనిఖీలు చేయాలని ఈసీ అధికారులు నిర్దేశించారు. మ్యారేజ్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని తెలిపారు. ఫ్లైయింగ్స్క్వాడ్లు, చెక్పోస్టు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సీఈఓ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, తప్పుడు ప్రచారంపై నిఘా పెట్టాలని ఆదేశించారు. అక్రమ మద్యం, డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. సాయంత్రం 6 నుంచి ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే సీఈవో వికాస్రాజ్ ఆదేశాలు జారీ చేశారు.
పోలింగ్ ఏర్పాట్లు పూర్తి
పోలింగ్ కోసం తుదిఏర్పాట్లలో జాగ్రత్తగా ఉండాలని అధికారులని వికాస్రాజ్ ఆదేశించారు. ఈవీఎంలు వీవీ ప్యాట్లు తీసుకెళ్లే వాహనాలపై పకడ్బందీ నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ వాహనాలకు జీపీఎస్ పెట్టడంతో పాటు భద్రతా సిబ్బంది వెంట ఉండాలని స్పష్టం చేశారు. ఈవీఎం స్ట్రాంగ్రూంల నుంచి బయటకు తీసేటప్పుడు పోలింగ్ తర్వాత మళ్లీ తీసుకెళ్లేటప్పుడు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే తప్పనిసరిగా వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. స్ట్రాంగ్రూంల్లో నిరంతర విద్యుత్ సరఫరా, అగ్నిమాపకచర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు, సిబ్బంది మొహరింపు ఈసీఐ నిబంధనల మేరకు జరగాలని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ రోజున ఈవీఎంలలో సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు ఈసీఐఎల్ ఇంజినార్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో 35,809 పోలింగ్ కేంద్రాల్లో 1,09,941 ఈవీఎం యూనిట్లు సిద్ధం చేశారు.