కెనడాలో జరగనున్న జీ7 సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో ఖలిస్థానీ వేర్పాటువాదులు తమ భారత వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో చిన్నారులను అడ్డం పెట్టుకుని చాలా తీవ్రమైన పనులను చేయిస్తున్నారు. భారత జాతీయ పతాకాన్ని అవమానించడం, ప్రధాని మోదీ చిత్రపటాలపై దాడులు చేయించడం వంటి దారుణమైన చర్యలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఓ ఖలిస్థానీ ఉగ్రవాది ప్రధాని మోదీని ఉద్దేశించి తీవ్ర బెదిరింపులకు దిగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు కొందరు ఆరుగురు చిన్నారులను రెచ్చగొట్టి, భారత జాతీయ జెండాను అపవిత్రం చేయించడంతో పాటు, ప్రధాని మోదీ చిత్రపటాలను కాళ్లతో తన్నేలా ప్రోత్సహించినట్లుగా ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలలో పెద్దలు కొందరు కెమెరాకు దూరంగా ఉంటూ పిల్లలను ఈ దిగజారుడు చర్యలకు ఉసిగొల్పడం స్పష్టంగా కనిపించింది. తమ మత, రాజకీయ లక్ష్యాల సాధన కోసం ఇస్లామిస్టులు మహిళలు, చిన్నారులను వినియోగించుకునే పద్ధతులను ఖలిస్థానీలు అనుసరిస్తున్నారని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
భారతీయ సిక్కుల తీవ్ర ఖండన
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు చిన్నారుల మనసుల్లో విషబీజాలు నాటి, వారిని విద్వేష ప్రచారానికి వాడుకోవడాన్ని భారతీయ సిక్కులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ సీనియర్ నేత మంజిందర్ సింగ్ సిర్సా పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. “కెనడాలో సిక్కు చిన్నారులతో విద్వేషపూరిత చర్యలు చేయిస్తున్న ఘటనలు చూసి ప్రతి సిక్కు తీవ్ర ఆవేదన, సిగ్గుతో తలదించుకుంటున్నారు. కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం చిన్న పిల్లలను తాలిబన్ల ప్రచారాన్ని తలపించేలా వాడుకోవడం దిగ్భ్రాంతికరం అని వారు వాపోతున్నారు.
ఇది సిక్కు చిన్నారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా, వారిలో ద్వేషాన్ని నింపి, సిక్కులను తీవ్రవాదులుగా చిత్రీకరించి ప్రపంచవ్యాప్తంగా సిక్కుల ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఇది గురు గ్రంథ్ సాహిబ్ జీ బోధనలకు, మానవత్వ సేవ, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం అనే సిక్కు మత మౌలిక సూత్రాలకు పూర్తిగా విరుద్ధం” అని అన్నారు.