టీఎస్, న్యూస్: సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్పై క్రిమినల్ కేసు నమోదైంది. తన ఇంట్లో కిరాయికి ఉంటున్న ఆయన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని హీరా గ్రూప్ చైర్మన్ నౌహిరా షేక్ ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు బండ్ల గణేశ్పై కేసు రిజిస్టర్ చేశారు.
నౌహిరా షేక్ ఫిలింనగర్లోని తన ఇంటిని గణేశ్కు నెలకు రూ.లక్ష అద్దె చొప్పున కిరాయికి ఇచ్చారు. అయితే కొంతకాలంగా కిరాయి ఇవ్వకపోగా గుండాలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఇంటిని ఖాళీ చేయాలని అడిగినందుకు ఫిబ్రవరి 15న తనను బెదిరించారని, గుండాలు, రాజకీయ నాయకుల సహాయంతో తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనపైనే పోలీసులు కేసు నమోదుచేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఆమె డీజీపీకి ఫిర్యాదు చేయడంతో బండ్ల గణేశ్పై ఫిలింనగర్ పోలీసులు ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.