హైదరాబాద్: ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ లోక్సభ స్థానం కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఆ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల వేళ హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ కృత నిశ్చయంతో ఉంది.. ఆ క్రమంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కె. మాధవి లతను బీజేపీ ఎన్నికల బరిలో నిలిపింది. ఇప్పటికే హైదరాబాద్ లోని పాత బస్తీతో పాటు పలు ప్రాంతాలపై ఆమెకు మంచి పట్టు ఉంది. దీంతో సదరు లోక్సభ నియోజక వర్గంలో ఆమె.. తన ప్రచారాన్ని హోరెత్తించారు. దాంతో, హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు, మే 13వ తేదీ ఎంఐఎం లోక్సభ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ జన్మ దినం.. ఆయన 55వ జన్మదినం ఈ రోజు.. 1969, మే 13వ తేదీన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, నిజామున్నీసా బేగం దంపతులకు అసదుద్దీన్ ఓవైసీ జన్మించారు. 2004 ఎన్నికల నాటి నుంచి హైదరాబాద్ లోక్సభ సభ్యుడిగా ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అంతకుముందు అంటే.. 2004 కు ముందు అసదుద్దీన్ ఎమ్మెల్యేగా పలుమార్లు విజయం సాధించిన విషయం విదితమే.. ఇక హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ను ఆ పార్టీ బరిలో దింపింది. ఇంకోవైపు పాత బస్తీ లోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. అయితే, ముస్లిం మహిళలు బురఖా ధరించి పోలింగ్ స్టేషన్లకు భారీగా తరలి వచ్చారు. ఆ క్రమంలో మాధవీ లత తన నియోజక వర్గం లోని ఓ పోలింగ్ బూత్లో ఓటింగ్ సరళని పరిశీలించారు. బూత్లో కూర్చున్న ముస్లిం ఓటర్ల బురఖాలను తొలగించాలని విజ్జప్తి చేసి.. వారి ఓటర్ ఐడీల పరిశీలించారు. అజాంపూర్ లోని పోలింగ్ బూత్ నెంబర్ 122లో ఆమె ఈ వెరిఫికేషన్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆమెపై కేసు నమోదు అయింది..