మలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక ప్రకంపనలు రేపుతోంది. కేరళ సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని నియమించగా, ఆ కమిటీ ఇచ్చిన నివేధిక సంచలనం రేపుతోంది. కేరళ చిత్ర పరిశ్రమలో మహిళలు దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని కమిటీ ఇచ్చిన నివేధిక పరిశ్రమలో చర్చనీయంశమవుతోంది. ఇటువంటి సమయంలో కేరళ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన వివాదం రాజుకుంది. సినీ పరిశ్రమలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీలోనూ క్యాస్టింగ్ కౌచ్ బెడద ఉందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు సిమీ రోస్ బెల్ జాన్ సంచలన ఆరోపణలు చేశారు.
కేరళ కాంగ్రెస్ పార్టీలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని సిమీ రోస్ బెల్ జాన్ ఆరోపించారు. ఎర్నాకుళానికి చెందిన రోస్ బెల్ శనివారం ఓ ప్రయివేట్ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సహా పలువురిపై ఆమె ఆరోపణలు చేశారు. పార్టీ నేతలతో సన్నిహితంగా ఉన్నవారికి మాత్రమే ముఖ్యమైన పదవులు దక్కుతున్నాయని ఆమె ఆరోపించారు. దీంతో ఇప్పుడు కేరళ కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో ఆమె ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోస్ బెల్ జాన్ ఆరోపణలపై కేరళ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.
దీన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం రోస్బెల్ జాన్ను బహిష్కరించింది. ఆమెను ఏఐసీసీ, పీఎస్సీ సభ్వత్వం నుంచి తొలగించి, పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కేరళ పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం లిజు ప్రకటించారు. మీడియా ముందు మహిళా నేతలను కించపరిచినందుకు రోస్ బెల్ జాన్ ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. తనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడంపై స్పందించిన రోస్ బెల్.. పరువు, ఆత్మగౌరవం ఉన్న మహిళలకు ఆ పార్టీలో చోటులేదని, గత కొంత కాలంగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిని బహిష్కరించారని విమర్శించారు.