రోడ్లు, భవనాల శాఖమంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మామునూరు ఎయిర్ పోర్ట్ కు అనుమతిని మంజూరు చేస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ కుమార్ ఝా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కు లేఖ ద్వారా తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ ప్రాధికార సంస్థ అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
గత పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న ఎన్వోసి అడ్డంకిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిఎంఆర్ సంస్థ యాజమాన్యం తో సంప్రదింపులు జరిపి, బోర్డులో పెట్టి ఎన్వోసి ఇచ్చేలా చేశారు. దీంతో హెచ్ఏఐఎల్తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ ఎన్వోసి ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎన్వోసీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిందని మంత్రి తెలిపారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ ద్వారా తెలిపినట్లు మంత్రి వివరించారు. దీంతో మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
విమానాశ్రయ ప్రాధికార సంస్థ నోట్ నెం. పీఎల్జి/501/వరంగల్/2025/80 తేదీ 03.02.2025 ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం 05.12.2024, 17.11.2024 తేదీల్లో పంపిన లేఖలను ప్రస్తావిస్తూ, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్.. మామునూరు ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ జారీ చేసినట్లు లేఖలో పేర్కొందని తెలిపిన మంత్రి అందుకు సంబంధించిన లేఖను విడుదల చేశారు. అంతేకాదు, మామునూరు ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కావాల్సిన 253 ఎకరాల అదనపు భూమిని తెలంగాణ ప్రభుత్వం విమానాశ్రయ ప్రాధికార సంస్థకి అప్పగించేందుకు ఇంతకు ముందే 205 కోట్లు విడుదల చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఎయిర్ పోర్టుకు కావాల్సిన అన్ని అనుమతులు రావడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మించేటప్పుడు కేంద్రంతో.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థ చేసుకున్న ఒప్పందంలోని క్లాజ్ 5.2 లో 25 సంవత్సరాల లోపల, 150 కిలోమీటర్ల పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉండి అభివృద్ధి చేసేవి. మరో కొత్త దేశీయ/అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతించరాదని ఆనాడు హెచ్ఐఏల్ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఈ పరిధిలో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరో ఎయిర్ పోర్టు నిర్మాణం జరగలేదు. అయితే, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్ధన మేరకు హెచ్ఐఏల్ తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అంగీకారం తెలిపింది.