Sunday, September 29, 2024

తొమ్మిదేండ్లలో ఏం చేశారు…?

  • ఒక్క గని కూడా వేలం వేయరా..?
  • తెలంగాణపై కేంద్రం ఆగ్రహం

తెలంగాణలో గనుల వేలంపై కేంద్రం ఘాటుగా స్పందించింది. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క మినరల్‌ బ్లాక్‌ను కూడా వేలం వేయలేదని కేంద్ర గనుల శాఖ పేర్కొంది. ఈ జూన్‌ 30 నాటికి కనీసం ఆరింటికి వేలం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి 11 బ్లాకుల జియాలాజికల్‌ నివేదికలను పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వీటిలో ఐదు సున్నపురాయి, ఐదు ఇనుప ఖనిజం, ఒకటి మాంగనీస్‌ బ్లాకు ఉన్నట్లు వెల్లడించారు.

గనుల వేలంపై కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు గుర్తు చేసినప్పటికీ, ఒక్క బ్లాక్‌ను కూడా వేలం వేయలేదని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జూన్‌ 30 నాటికి కచ్చితంగా కనీసం ఆరింటికి వేలం పూర్తిచేయాలని సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర మంత్రిత్వశాఖ లేఖ రాసింది. ఈ విషయంలో విఫలమైతే, ఆ ప్రక్రియను కేంద్రమే చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది. దేశంలో గనుల వేలం ప్రక్రియ 2015లో ప్రారంభమైంది. 2021లో ఈ నిబంధనలను సవరించారు. వాటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట గడువులోగా వేలం ప్రక్రియను పూర్తి చేయాలి. లేని పక్షంలో వాటిని నిర్వహించే అధికారం కేంద్రానికి వస్తుంది.

ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 354 ప్రధాన మినరల్‌ బ్లాక్‌లను వేలం వేశారు. 48 చోట్ల ఉత్పత్తి ప్రారంభమైంది. దీంతో సదరు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పెరిగింది. తెలంగాణలో మేజర్, మైనర్‌ మినరల్‌ బ్లాకులను వేలం పద్ధతిలో కేటాయించేందుకు గనులశాఖ సిద్ధమైందని, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఇటీవల తెలిపాయి. ఖనిజాల వారీగా ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. ఇందులో మూడు సున్నపురాయి బ్లాకులు కాగా, మరో 12 చిన్నతరహా ఖనిజాలని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం రాగానే వేలం ప్రక్రియను ప్రారంభించాలని గనుల మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేలంలో అర్హత సాధించిన వారికి ఆయా గనుల్ని 20 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular