ఉత్తర్వులు జారీ చేసీన సీఈవో వికాస్ రాజ్
నల్గొండ -ఖమ్మం – వరంగల్ జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటు ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ (సీఎల్) ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 27 (సోమవారం) రోజున ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, నల్గొండ, సూర్యపేట, యాదాద్రి భువనగరి జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో వికాస్ రాజ్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రైవేటు ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని చట్టంలో పేర్కొలేనందున తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో వికాస్ రాజ్ సూచించారు. ఆయా ప్రైవేటు సంస్థలు, వ్యాపార సంస్థలు తమ సిబ్బంది ఓటు వేసేందుకు వీలుగా షిఫ్టులు సర్ధుబాటు లేదా ఆలస్యంగా విధులకు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.