-
సిఎం రేవంత్ రెడ్డి కోసం హెచ్జిసీఎల్ కార్యాలయంలో ఛాంబర్ రెడీ
-
రూ.60 లక్షల వ్యయంతో పనులు ప్రారంభం
సిఎం రేవంత్ రెడ్డి కోసం ఔటర్ రింగ్రోడ్డుకు దగ్గరలోనే ఓ కార్యాలయం సిద్ధం అవుతోంది. నానక్ రాంగూడ ఔటర్ రింగురోడ్డు ఇంటర్ఛేంజ్లో ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జిసీఎల్) కార్యాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడుసార్లు సిఎం రేవంత్ రెడ్డి హెచ్జిసీఎల్ కార్యాలయం నుంచి ఎంఎయూడి పరిధిలోని పలు శాఖలతో ఉన్నతాధికారులు, ఆయా శాఖలు చేపట్టే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షలు నిర్వహించారు. ప్రత్యేకంగా పురపాలక శాఖకు సంబంధించిన కార్యకలాపాలకు ఇది ఎంతో అనువుగా ఉండటంతో ఇక్కడి నుంచే ఆ శాఖ పరిధిలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్బోర్డు, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ (ఎంఆర్డీసీఎల్) వంటి శాఖల ఉన్నతాధికారులతో తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నానక్రాంగూడ హెచ్జిసీఎల్ భవనాల వద్ద భద్రతపరంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని హెచ్ఎండిఏ అధికారులు నిర్ణయించారు.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్దే ఉండటంతో ఇక్కడ ఆయన కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కూర్చునేందుకు ప్రత్యేకంగా చాంబర్తో పాటు ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు సెమినార్ హాల్స్ రెండు ఉన్నాయి. ఇందులో భాగంగా సుమారు రూ.60 లక్షల వ్యయంతో రెండు భవనాల చుట్టూ రక్షణగా వ్యూ కట్టర్స్ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం తార్నాకలో ఉన్న మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయాన్ని సైతం ఇందులో ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే సుమారు రూ.70 లక్షల వ్యయంతో ఇంటీరియర్ పనులు చేపట్టారు.