వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపినందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్పై ముస్లిం సంఘాలు, ముస్లిం నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వీరిద్దరినీ చరిత్ర ఎప్పటికీ క్షమించదనీ.. ద్రోహులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానిస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా షరియత్పై దాడి చేయడానికి బీజేపీకి వీరిద్దరు సహకరించారని ఆరోపిస్తున్నారు నేతలు. చంద్రబాబు, నితీష్, చిరాగ్పాశ్వాన్, జయంత్ చౌధురిలు వ్యతిరేకించి ఉంటే బిల్లు ఆగిపోయేదని.. కానీ వీరు అలా చేయలేదని.. ముస్లింల మసీదు, వక్ఫ్ ఆస్తులు నాశనం చేయడానికి వీరు బీజేపీకి మద్దతిచ్చారని దుయ్యబట్టారు. గతంలో ఇదే చంద్రబాబు, నితీష్ కుమార్ బీజేపీ ప్రవేశపెట్టే వక్ఫ్ బిల్లు ముస్లింల పరిరక్షణకు వ్యతిరేకంగా ఉందని.. ఆ బిల్లుకు తాము ఎలాంటి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సంవత్సరంలో పరిస్థితులు ఊహించని విధంగా మారడం.. ఈ రెండు పార్టీలు ఎన్డీఏలో కీలకమవడం లాంటివి చకచకా జరిగిపోయాయ్. కూటమిలో భాగం కావడంతో ఈ రెండు పార్టీలు బీజేపీ తీసుకొన్న నిర్ణయానికి తలొగ్గాయ్. అయితే టీడీపీ మాత్రం వక్ఫ్ బిల్లుకు తాము 3 సవరణలు సూచించామని.. ఆ సవరణలతోనే బిల్లు ప్రవేశపెట్టారని చెబుతోంది. బీహార్లో మాత్రం నితీష్ నిర్ణయం మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామాలు చేస్తోన్నారు ఆ పార్టీ నేతలు.