అంతరిక్ష చరిత్రలో రికార్డు సృష్టించిన చైనా
అంతరక్ష చరిత్రలో చైనా మరో అద్భుతమైన విజయం సాధించింది. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి చంద్రుడుకి ఆవలివైపు ప్రాంతం నుంచి మట్టి నమూనాలను సేకరించి వాటిని సమర్ధవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. జాబిల్లి రెండో వైపు నుంచి మట్టితో పాటు పలు రకాల శిథిలాలను మోసుకొని చైనా ప్రయోగించిన లూనార్ ల్యాండర్ చాంగే-6 వ్యోమనౌక భూమిపైకి విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో చాంగే-6 సురక్షితంగా దిగినట్లు చైనా ప్రకటించింది.
గత నెల మే 3న చైనా ప్రయోగించిన వ్యామోనైక చాంగే-6 సుమారు 53 రోజుల పాటు ప్రయాణించి చంద్రుడిపైన దిగింది. జూన్ 2న చందమామ ఆవలివైపున సౌత్ పోల్ అయిట్కిన్ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్ లో అది సక్సెస్ ఫుల్ గా ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. ఈ క్లిష్టమైన మిషన్ లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే నాలుగు భాగాలు ఉన్నాయి. చంద్రుడు ఉపరితలంపై ఉన్న నమూనాలను ప్రత్యేకంగా రూపొందించిన రోబోటిక్ హస్తం సాయంతో సేకరించింది. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి దిగువనున్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుంది. ఆ తరువాత మట్టితో పాటు ఇతర మెటీరియల్ ను తీసుకుని భూమిపైకి దిగింది చాంగే-6.
చైనా వ్యోమో నౌక తీసుకొచ్చిన మట్టి తదితర నమూనాల్లో 25 లక్షల సంవత్సరాల పురాతన అగ్నిపర్వత శిలలు కూడా ఉండవచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నమూనాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి, సమూలమైన అధ్యయనం చేస్తే చందమామకు రెండు వైపులా ఉన్న భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని చైనా భావిస్తోంది. ప్రస్తుతం జాబిల్లికి సంబంధించిన ఒక వైపు భాగం మాత్రమే భూమి నుంచి మనకు కనిపిస్తుంది.
మరో వైపు భాగాన్ని నియర్ సైడ్ గా పులుస్తారు. రెండో పార్శ్యాన్ని ఫార్ సైడ్ గా పిలుస్తారు. ఇప్పటివరకు అమెరికా, రష్యాలతో పాటు చైనా కూడా పలుమార్లు నియర్ సైడ్ నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకొచ్చాయి. ఐతే చంద్రుడికి అవతలి భాగం నుంచి మట్టి, శిథిలాలను తీసుకురావడం ఇదే మొట్టమొదటి సారి అని చెప్పాలి. చందమామపై ఇవతలి భాగం ఒకింత చదునుగా ఉండగా, అవతలి ప్రాంతం అంతరిక్ష శిలలు ఢీకొట్టడంతో ఏర్పడిన బిలాలతో నిండిపోయి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.