చార్మినార్ లోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి అధికారులు పలు లోపాలను గుర్తించారు. అగ్నిప్రమాదంలో మొత్తం 17 మంది మృతిచెందడం తెలిసిందే. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించడానికి ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఉదయం 6 నుంచి 6.15 గంటల సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. మొత్తం 21 మంది ఉండగా నలుగురు ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించారు.
తలుపులు పగలగొట్టి రెస్క్యూ ఆపరేషన్
చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. లోపలికి వెళ్లే మార్గంలేక తలుపులు పగులగొట్టి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. గుల్జార్ హౌస్ బిల్డింగ్ప్రమాదంతో అక్కడ చాలా లోపాలు బటయపడ్డాయి. ఈ గుల్జార్హౌస్భవనం గ్రౌండ్ ఫ్లోర్లో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి అంతస్తులో వ్యాపారి కుటుంబం నివాసం ఉంటోంది. ఆ ఇంట్లో తరచూ విద్యుత్ సమస్య వస్తుందని అధికారులు గుర్తించారు. ఇరుకు మెట్లు, దట్టమైన పొగ కమ్ముకోవడంతో లోపలికి వెళ్లే మార్గం కనిపించలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఫైర్ సిబ్బంది చివరకు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లింది. మంటలు అంటుకున్న తరువాత లోపల చిక్కుకున్న వారికి బయటకు వచ్చేందుకు ఫైర్ ఎగ్జిట్ లాంటివి లేదని గుర్తించారు. ఒకే మార్గంలో ఇంటి లోపలకి వెళ్లాల్సి ఉంటుంది. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన రెస్క్యూ టీమ్ స్పృహ తప్పి ఉన్న పలువురిని బయటకు తీసుకొచ్చారు.
సమ్మర్ హాలిడేస్ తో పెరిగిన ప్రాణ నష్టం
సమ్మర్ హాలిడేస్ కావడంతో వ్యాపారి ఇంటికి పలువురు బంధువులు వచ్చారు. వీరంతా బెంగాల్ నుంచి ఎక్కడికి వచ్చినట్లు సమాచారం. నిన్నటి వరకు అత్తాపూర్ లో ఉన్న మరికొందరు శనివారం సాయంత్రం చార్మినార్ లోని వ్యాపారి ఇంటికి వచ్చారు. అగ్నిప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం పెరగడానికి ఇదొక కారణమైంది. మృతులలో స్థానికంగా ఉండే వారి కంటే బెంగాల్ నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం
ఏసీలో షార్ట్ సర్క్యూట్ తర్వాత గ్యాస్ లీకై ఇంట్లో ఉన్న ఎల్పీజీ సిలిండర్ పేలిపోయింది. ఇంట్లో ఉన్న చెక్క వస్తువుల కారణంగా వంటలు వేగంగా వ్యాపించాయి. ఇంట్లో దట్టమైన పొగ చేరడంతో పాటు ఒకే మెట్ల మార్గం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనలను ఉపయోగించి ఫస్ట్ ఫ్లోర్కు వెళ్లారు. అప్పటికే స్పృహ తప్పి పడి ఉన్న 17 మంది ని బయటకు తీసుకొచ్చి అంబులెన్స్ లలో పలు హాస్పిటల్స్కు తరలించారు. వారిలో కొంతమంది మార్గమధ్యలోనే మృతిచెందగా, కొందరు చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 17 కు చేరుకుందని అధికారులు తెలిపారు. పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు ప్రధాని మోదీ. మంత్రులు పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి బాధితుల కుటుంబసభ్యులను పరామర్శించారు.