- 12 ప్యానల్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్తో చెకింగ్..
- డ్రగ్స్ తీసుకుంటే నిమిషాల్లోనే టెస్టింగ్లో దొరికేలా అధునాతన పరికరాలు
- కొకైన్, గంజాయి, ఓపియేట్స్, యాంఫేటమిన్లు, మెథాంఫేటమిన్లు, కెటామైన్ లాంటి
- డ్రగ్స్ను తీసుకున్నా పసిగట్టే పరికరాలు అందుబాటులోకి…
- టీజీ న్యాబ్, పోలీస్ యంత్రాంగంతో కలిసి
- డ్రగ్స్ను అరికట్టడానికి ఎక్సైజ్ శాఖ వినూత్న పంథా
గంజాయి, డ్రగ్స్ను అరికట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ను అరికట్టడానికి ఎక్సైజ్ శాఖ టీజీ న్యాబ్, పోలీస్ యంత్రాంగంతో కలిసి కట్టడి చేయడానికి ప్రత్యేక దృష్టిసారించింది. దీంతోపాటు నిరంతరం పబ్లు, బార్ల వద్ద 12 ప్యానల్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్తో పరీక్షలు నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్టుగా తెలిసింది. స్టాఫ్ట్వేర్ రంగంతో పాటు పారిశ్రామిక, విద్య, వైద్య రంగాలతో పాటు వ్యాపార రంగాల్లో గ్రేటర్ హైదారాబాద్ ప్రత్యేక స్థానం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే మత్తుపదార్ధాలకు అధిక డిమాండ్ ఏర్పడింది.
అందులో భాగంగా కర్ణాటక నుంచి డ్రగ్స్, గోవా ఇతర ప్రాంతాల నుంచి ఎన్డీపిఎల్ మద్యం, డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. మరో పక్క ఏఓబి ఆంధ్రా, ఒరిస్సా ప్రాంతాల నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి రవాణా అవుతోంది. ఈ నేపథ్యంలోనే గంజాయి, డ్రగ్స్ను పూర్తిగా అరికట్టడంలో భాగంగా ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, ఎక్సైజ్శాఖ కమిషనర్ శ్రీధర్లు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి వాటిని అరికట్టడానికి విశేష కృషి చేస్తున్నారు. ఈనెలాఖరులోగా గుడుంబా నిర్మూలనకు నడంబిగించిన ఎక్సైజ్ శాఖ దీంతోపాటు గంజాయి, డ్రగ్స్ల భరతం పట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా డ్రగ్స్ను అరికట్టడానికి డిటెక్షన్ కిట్స్తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
టీన్యాబ్ సహకారంతో….
హైదరాబాద్లో కోటి నుంచి కోటిన్నర జనాభా నివాసం ఉంటోంది. అందులో వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి పేరుతో హైదరాబాద్లో 36 లక్షల మంది ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే జీవనోపాధి కోసం వచ్చిన వారిలో ఎక్కువ మంది గంజాయి, డ్రగ్స్ దందాను జీవనోపాధిగా ఎంచుకొని వాటిని సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పబ్లు, బార్లపై నిఘా పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. దీనికోసం స్థానిక పోలీసుల సాయంతో పాటు టీన్యాబ్ సహకారం తీసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో బార్లు, క్లబ్లు అధికంగా ఉన్నాయి. కొన్ని బార్లలో డ్రగ్స్ను అమ్ముతున్నట్టుగా ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆయా పబ్లపై ఆకస్మిక దాడులు చేసి 12 ప్యానల్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.
12 ప్యానల్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్కు రూ.60 నుంచి రూ.70 లక్షలు
ఇప్పటికే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో 12 ప్యానల్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్తో డ్రగ్స్కు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ పబ్ల వద్ద కూడా ఈ పరికరంతో పరీక్షలు చేయాలని నిర్ణయించింది.ఈ పరికరంతో నిమిషాల్లోనే డ్రగ్స్ తీసుకుంటే తేలుతుంది. ఈ కిట్ ద్వారా కొకైన్, గంజాయి, ఓపియేట్స్, యాంఫేటమిన్లు, మెథాంఫేటమిన్లు, కెటామైన్లతో సహా వివిధ రకాల డ్రగ్స్ను సేవించినా ఇట్టే తెలిసిపోతుంది. ఈ కిట్స్తో యూరిన్ శాంపిల్స్, సలైవా శాంపుల్ టెస్టులను చేస్తారు. సలైవా శాంపుల్ టెస్టింగ్ కిట్ను జర్మనీ నుంచి, యూరిన్ శాంపుల్ టెస్టింగ్ కిట్స్ జపాన్, అమెరికాల నుంచి ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంది. ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకునే ఈ 12 ప్యానల్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్కు సుమారుగా రూ.60 నుంచి రూ.70 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. సుమారుగా నాలుగు రోజుల క్రితం డ్రగ్ తీసుకున్నా ఈ పరికరం ఇట్టే పసిగడుతుందని అధికారులు తెలిపారు.
ఈ సంవత్సరం 246 బార్లపై కేసులు
రాష్ట్రవ్యాప్తంగా 1,171 బార్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇవ్వగా అందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అధికంగా బార్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. హైదరాబాద్లో 142, సికింద్రాబాద్లో 98, మల్కాజిగిరిలో 117, మేడ్చల్లో 104, సరూర్నగర్లో 104, శంషాబాద్లో 157 బార్లకు ఎక్సైజ్శాఖ అనుమతులు ఇచ్చింది. అయితే అందులో నిబంధనలను అతిక్రమించిన వారిపై ఎక్సైజ్ శాఖ ఈ సంవత్సరంలో 246 కేసులను సైతం నమోదు చేసింది.