ప్రభాకర్రావు ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆయన తరఫు న్యాయవాది సి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. 30 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన ప్రభాకర్ రావు రాష్ట్రపతి అవార్డును కూడా సొంతం చేసుకున్నారన్నారు. ఫోన్ట్యాపింగ్ కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనని, కొందరు రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకొని నమోదు చేసిన కేసులో ప్రభాకర్రావును నిందితుడిగా చేర్చారన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, కీలకమైన పరికరాల ధ్వంసం చేశారనడంలో వాస్తవం లేదన్నారు. 65 ఏళ్ల వయసున్న ప్రభాకర్ రావు ప్రస్తుతం కేన్సర్ చికిత్స కోసం అమెరికాలో ఉన్నారని, ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. పదవీ విరమణ పొందిన తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ఓఎస్డీగా కీలకమైన ఎస్ఐబీ కొనసాగారని తెలిపారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ప్రభాకర్ రావు పదవీకాలం మరో మూడేళ్లు పొడిగించేవారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును ప్రశ్నిస్తే మరింత కీలక సమాచారం వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.