పగిలిన తల.. పోలీసుల దగ్గర పంచాయతీ
` నాకు లెగ్ పీస్ వేయలే – నేను డబ్బులివ్వను’ అంటూ మొదలైన గొడవ.. తలలు పగిలేలా చేసింది. చివరకు ఠాణా మెట్లెక్కారు. పోలీస్ స్టేషన్ నుంచి మళ్లి గ్రామ పెద్దల వరకు చేరిన అక్కడ పంచాయితీ తెగింది. దీంతో బాధితుల చేతి చమురు వదిలింది. చికెన్.. అందులో చాలా మందికి ఇష్టంగా ఉండే లెగ్ పీస్ ఒకరి తల పగులకొట్టిస్తే, మరొకర్ని చితకబాదేలా చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్కు వెళ్లినా కేసు నమోదవ్వని ఈ ఘటన సూర్యాటపేట జిల్లా మేళ్లచెరువులో చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు మేళ్ల చెరువులోని ఓ చికెన్ దుకాణానికి వచ్చి, అందులో పని చేస్తున్న యువకిడికి చికెన్ ఆర్డరిచ్చాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య లెగ్ పీస్లపై వాదన మొదలై.. చివరకు దాడి చేసే వరకు వెళ్లింది. అయితే, ఇచ్చిన చికెన్లో తను అనుకున్నట్లు లెగ్ పీస్ వేయలేదని, అందుకు తాను డబ్బులు ఇవ్వబోనని కొనుగోలుదారుడు అన్నాడు. దాంతో గొడవ పెరిగి మరింత పెద్దగైంది. కోపోద్రిక్తుడైన దుకాణంలో పని చేసే యువకుడు చికెన్ కోసం వచ్చిన యువకుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో అతని తల పగిలింది. అక్కడున్న వారు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న దుకాణం యజమాని బాధితుడిని కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లాడు.
అక్కడే మరో వివాదం
యజమాని అక్కడకు వెళ్లడంతో మరో వివాదం చోటుచేసుకుంది. చికెన్ విషయంలో ఇలా కొడతారా అని బాధితుడి తరఫు బంధువులు దుకాణ యజమానిని చితకబాదారు. దీంతో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అటు నుంచి గొడవ మళ్లీ రెండు గ్రామాల పెద్ద మనుషుల వద్దకెళ్లింది. పెద్ద మనుషుల పంచాయితీ అనంతరం తల పగులకొట్టిన యువకుడికి జరిమానా విధించినట్లు తెలిసింది. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, తాము మాట్లాడుకుంటామని చెప్పారని, మళ్లీ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.