Friday, September 20, 2024

జిల్లాకో ఫ్లాగ్షిప్ కార్యక్రమం

  • ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యం
  • సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై దృష్టి పెట్టాలి
  • ఎవరో చెబితే కలెక్టర్‌లు, ఎస్పీలకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు
  • సమర్ధత ఆధారంగా ఈ పోస్టింగ్‌లు ఇచ్చా
  • డిజిపి నుంచి కానిస్టేబుల్ వరకు ఫిజికల్ పోలీసింగ్ నిర్వహించాలి
  • జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • సుమారు 9 గంటల పాటు సాగిన సమావేశం

ఆయా జిల్లాలో ఉన్న వనరులు, ప్రాంత పరిస్థితుల ఆధారంగా ప్రతి కలెక్టర్ ఒక్కో ఫ్లాగ్షిప్ కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా కార్యక్రమాలపై కలెక్టర్ల ముద్ర స్పష్టంగా ఉండాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సదస్సులో భోజనవిరామం అనంతరం పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి మార్గనిర్దేశనం చేశారు. ఉదయం నుంచి జరిగిన ఈ సమావేశం సుదీర్ఘంగా సుమారుగా 9 గంటల పాటు కొనసాగింది. ఆరు గ్యారంటీల అమలును కలెక్టర్లు సీరియస్‌గా తీసుకోవాలని, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

జాతీయ రహదారులకు భూ సేకరణలో జాప్యం జరుగుతుండడంతో వ్యయం పెరుగుతోందని, సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించాలని సిఎం రేవంత్ సూచించారు. జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రుల కార్యక్రమాలకు సరైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కలెక్టర్‌లు, ఎస్పీలు, జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సిఎం సూచించారు. ఎవరో చెబితే కలెక్టర్‌లు, ఎస్పీలకు పోస్టింగ్‌లు ఇవ్వలేదని, సమర్ధత ఆధారంగా తానే ఈ పోస్టింగ్‌లపై నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. డిజిపి నుంచి కానిస్టేబుల్ వరకు ఫిజికల్ పోలీసింగ్ నిర్వహించాలని సిఎం రేవంత్ సూచించారు.

వికారాబాద్ అడివిలో ఔషధ మొక్కలు నాటించాలి
అటవీ భూముల్లో పండ్ల మొక్కలు నాటడం వలన ఓ వైపు గిరిజనులకు ఆదాయం, మరో వైపు పచ్చదనం పెంపొందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గిరిజనులకు ఆదాయం లేక పోడు వ్యవసాయంపై ఆధారపడుతున్నారని, వారికి పట్టాలు ఇచ్చిన భూముల్లో మామిడి, సీతాఫలం, జామ వంటి పండ్ల మొక్కలు నాటిస్తే సీజన్ల వారీగా పండ్ల ద్వారా ఆ కుటుంబాలకు ఆదాయం వస్తుందన్నారు. మూడు నుంచి నాలుగేళ్లలో పంట వచ్చే హైబ్రిడ్ మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలని సిఎం సూచించారు. ఆదాయం ఉన్నప్పుడు ఆ చెట్లనే వారే రక్షిస్తారని, మరోవైపు పచ్చదనం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.

పలు అటవీ ప్రాంతాల్లో ఎకరాల కొద్ది ఖాళీ ఉందని, డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేయించాలని ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం అక్కడ భూసార పరీక్షలు చేయించి ఆ నేలల్లో పెరిగే పండ్ల మొక్కలు నాటించాలని ఆయన ఆదేశించారు. తద్వారా కోతుల సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుందని సిఎం అన్నారు. వికారాబాద్ హవా టిబికా దవా అనే (వికారాబాద్ గాలి టిడికి మందు) నానుడి ఉందని, కానీ, ఇప్పుడు వికారాబాద్ అటవీ ప్రాంతం చాలా వరకు ఖాళీగా ఉందన్నారు. అక్కడ గతంలో మాదిరిగా ఔషధ మొక్కలు నాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పులుల ఆవాసం కోసం ఏర్పాట్లు చేయాలి
పులుల సఫారీకి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతానికి వెళుతున్నారని, మన దగ్గర ఆదిలాబాద్ జిల్లాలోనూ అటవీ ప్రాంతం ఉన్నా పులులు సంచారం లేదని, వాటికి అవసరమైన ఆవాసం, నీటి సౌకర్యం కల్పిస్తే అటవీ పర్యాటకం పెంపొందించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వన మహోత్సంలో భాగంగా మనం నాటే మొక్కలు 50 ఏళ్ల పాటు ఫలసాయం అందించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కలెక్టర్లు నెలకోసారి అటవీ ప్రాంతాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో మాదిరిగా ప్రభుత్వ భూమి లభ్యత లేనందున ప్రాజెక్టు కట్టలు, కాలువ కట్టలు, రహదారుల వెంట తాటి, ఈత చెట్లు నాటాలని, మూడు, నాలుగేళ్లలో గీత వృత్తిదారులకు ఆదాయం వచ్చేలా హైబ్రిడ్ మొక్కలు నాటాలని సిఎం ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వసతిగృహాలు ఒకే చోట ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గంలో రహదారులకు అనుసంధానంగా ఉండే గ్రామాలు, పట్టణాల్లో వాటికి స్థలాల ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎవరు ముందుగా స్థలాలు ఎంపిక చేస్తే వారికి వెంటనే నిధులు విడుదల చేస్తామని సిఎం రేవంత్ హామీ ఇచ్చారు.

కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేయాలి
రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటిసి)లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కలెక్టర్లు తమ పరిధిలోని ఐటిఐలను సందర్శించి వాటిని ఏటిసిలుగా మార్చే ప్రక్రియ ఎలా సాగుతుందో పరిశీలించాలన్నారు. అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఐటీఐలను ఏటిసిలుగా మార్చుతున్నందున ప్రస్తుతం ఉన్న ఐటీఐల్లో స్థలం సరిపోకపోతే ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యారంగానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలతో బడుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేయాలని, డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు తరచూ పాఠశాలలను తనిఖీ చేసేలా చూడాలని సిఎం రేవంత్ ఆదేశించారు. కలెక్టర్లు పాఠశాలలు తనిఖీ చేసిన తర్వాత అక్కడ సమస్యలు పరిష్కారం కావాలని, లేకుంటే ఆ తనిఖీలకు ప్రాధాన్యం తగ్గిపోతుందన్నారు. మధ్యాహ్న భోజనం మరింత మెరుగ్గా అందించేందుకు హరేకృష్ణ మూవ్‌మెంట్ వంటి సంస్థల సహకారం తీసుకునే అంశంపై అధ్యయనం చేయాలని విద్యా శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడొద్దని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతోనే కానీ, నేరస్థులతో కాదన్న విషయం గుర్తుంచుకోవాలని సిఎం రేవంత్ సూచించారు. పబ్బులు విషయంలో టైమింగ్ పెట్టొచ్చని, ఆంక్షల పేరుతో రాత్రి వేళ్లల్లో స్ట్రీట్ ఫుడ్ పెట్టుకునే వారిని ఇబ్బంది పెట్టవద్దని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్‌లకు ముఖ్యమంత్రి సూచించారు. ఐటీ రంగంలో వారు రాత్రి వేళల్లో పని చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నగర శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిఎం ఆదేశించారు. పోలీసులు రహదారులపై కనిపించాలని, పీరియాడికల్ క్రైమ్ రివ్యూ చేయాలని, కమిషనర్లు, ఎస్పీలు మొదలు ఎస్‌హెచ్‌ఓల వరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని సిఎం రేవంత్ ఆదేశించారు. గతేడాది కన్నా నేరాలు తగ్గాయని పోలీసు అధికారులు వివరించారు.

గణాంకాలతో ఆ వివరాలను మీడియాకు తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో పోలీసు, ఎక్సైజ్, టిజి న్యాబ్ అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి అన్నారు. డ్రగ్స్ కేసుల్లో విదేశీయులు పట్టుపడుతున్నారని, వారు ఏ పని మీద రాష్ట్రానికి వస్తున్నారు, ఏం చేస్తున్నారన్న దానిపై దృష్టి సారించాలన్నారు. డ్రగ్స్‌లో పట్టుపడిన వారిని డిఅడిక్షన్ సెంటర్లో ఉంచాలని, ఇందుకోసం చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులో కొంత భాగాన్ని వినియోగించుకోవాలన్నారు.

కల్తీ ఎరువులు, విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు చేపట్టాలి: మంత్రి తుమ్మల
కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులు, యూరియా సిద్ధంగా ఉన్నాయని, సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ముందుగానే కలెక్టర్లు జాగ్రత్త వహించాలని మంత్రి పేర్కొన్నారు. కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారని, అటువంటివి జరగకుండా జాగ్రత్త పడాలని మంత్రి తుమ్మల హెచ్చరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos