- నేడు తిరిగి హైదరాబాద్కు
- కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. నేడు ఆయన హైదరాబాద్కు తిరిగిరానున్నారు. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్లో తమ కొత్త క్యాంపస్ను నిర్మాణం చేయనున్న నేపథ్యంలో నేడు ఉదయం సిఎం రేవంత్రెడ్డి దానికి శంకుస్థాపన చేయనున్నారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సిఎం విదేశీ పర్యటనలో పెట్టుబడులకు సంబంధించి బిజీబిజీగా గడిపారు. విదేశాల్లో జరిగిన సమావేశాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉండే అవకాశాలు, వాటికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి సిఎం ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ఈ పర్యటనలో సిఎం తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి తదితరులు ఈ పర్యటనలో పాలుపంచుకున్నారు.
25 అగ్రశ్రేణి టెక్స్టైల్స్ కంపెనీల అధినేతలతో
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలను పెట్టుబడులను పెట్టడంలో ఆకర్షించడంలో చేసిన విదేశీ పర్యటనను సిఎం రేవంత్ రెడ్డి విజయవంతంగా ముగించారు. ప్రస్తుతం సిఎం సౌత్ కొరియా పర్యటన ముగించుకొని తిరిగి ప్రయాణం అయ్యారు. శనివారం అమెరికా పర్యటన ముగించుకొని సిఎం రేవంత్ కొరియాకు వెళ్లారు. అయితే ఇప్పటికే వరంగల్ లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్లో సౌత్ కొరియా నుంచి సిఎం రేవంత్ బృందం పెట్టుబడులను రాబట్టింది. దీంతో పాటు కొరియాలోని పలు వ్యాపార కంపెనీలు, వాణిజ్య సమూహాల ప్రతినిధులతో సిఎం బృందం చర్చలు జరిపింది. ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీ హ్యుందాయ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చింది. దీంతోపాటు 25 అగ్రశ్రేణి టెక్స్టైల్స్ కంపెనీల అధినేతలతో కూడా సిఎం బృందం సమావేశమై పెట్టుబడులపై చర్చించారు. ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో పాటు ఈనెలాఖరులోగా పలు కంపెనీలు తమ సంస్థలను రాష్ట్రంలో విస్తరించనున్నాయి.
10 లక్షల చదనపు అడుగుల్లో కొత్త క్యాంపస్
అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓ రవికుమార్ తో చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించింది. హైదరాబాద్ లో 10 లక్షల చదనపు అడుగుల్లో కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై ఈ కొత్త క్యాంపస్ ఫోకస్ చేస్తుంది. 1994లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హైదరాబాద్లో 2002 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది.
ఐటీ కారిడార్లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో దాదాపు 57 వేల మంది ఉద్యోగులున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్కు పేరుంది. గడిచిన రెండేళ్లలో ఈ కంపెనీ రాష్ట్రంలోని 34 వివిధ విద్యాసంస్థల నుంచి 7,500ల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో కాగ్నిజెంట్ కంపనీ తెలంగాణ నుంచి రూ. 7,725 కోట్ల ఐటీ ఎగుమతులను నమోదు చేసింది. గడిచిన అయిదేళ్ల్లలో కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ కింద ఈ కంపెనీ రూ. 22.5 కోట్లతో వివిధ సామాజిక కార్యక్రమాలను సైతం చేపట్టింది.