ఒకప్పటి హిట్ పెయిర్ బాలకృష్ణ, విజయశాంతి మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. దాదాపు 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని, అది కూడా బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అఖండ-2’లో అని గట్టిగా వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే అభిమానులకు పండగే అని చెప్పాలి.
గతంలో బాలకృష్ణ, విజయశాంతి జోడీకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ‘కథానాయకుడు’ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం, ‘ముద్దుల క్రిష్ణయ్య’, ‘ముద్దుల మావయ్య’ వంటి గోల్డెన్ జూబ్లీ చిత్రాలతో పాటు ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్స్పెక్టర్’ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల వరకు సాగింది. వీరిద్దరూ కలిసి దాదాపు 16 సినిమాల్లో నటించి, తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. చివరిసారిగా 1993లో వచ్చిన ‘నిప్పురవ్వ’ చిత్రంలో ఈ జంట కనిపించింది.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాకు సీక్వెల్గా ‘అఖండ-2’ తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో విజయశాంతి ఓ కీలక పాత్ర పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్తలు నిజమై, వీరిద్దరూ మళ్లీ కలిసి నటిస్తే, సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. కానీ ఒకానొక సమయంలో విజయశాంతి బాలయ్యతో చెయ్యడానికి ఇష్టపడలేదనే వినికిడి కూడా ఉంది. అదే విధంగా ఇటీవలె విజయశాంతి ఓ మీడియా ఇంటర్వ్యూలో చిరంజీవితో నటించే అవకాశం వస్తే నటిస్తారా అంటే నటించను అని కరాఖండీగా చెప్పేశారు. మరి ఇప్పుడు బాలయ్య విషయం తెరమీదకు వచ్చింది. ఇది ఏమి జరుగుద్దో చివరకు ఆలోచించాలి మరి.