సినీ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్పై దాడి జరిగింది. హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. కొద్ది రోజుల క్రితం అక్రమ ఆక్రమణలను హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నెల క్రితం గచ్చిబౌలి ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ(ఎఫ్సీఐ) లేఅవుట్లో సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణలను సైతం తొలగించింది. సంధ్యా కన్వెన్షన్లో అక్రమంగా నిర్మించిన మినీహాల్తో పాటు కొన్ని గదులు, 2 షెడ్లు నేలమట్టం చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసిన సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు రహదారులను, పార్కులను ఆనవాళ్లు లేకుండా చేశారని కాబట్టి వాటిని పునరుద్దరించాలని కోరారు.
ఈ క్రమంలోనే మంగళవారం హైడ్రా, శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు లేఅవుట్లో రహదారుల పనులకు శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో ప్లాట్ యజమానుల్లో ఒకరైన సినీ నటి రమ్యశ్రీ తన సోదరుడు ప్రశాంత్తో కలిసి అక్కడకు వచ్చి ఫోటోలు, వీడియోలు తీశారు. అనంతరం మధ్యాహ్న భోజనానికి వెళుతున్న రమ్యశ్రీ, ఆమె సోదరుడిని శ్రీధర్రావు అనుచరులు వారి ఫోన్ లాక్కొన్ని అడ్డుకుని దాడికి యత్నించారు. ప్రశాంత్ అడ్డుకోగా అతడిని కొట్టారు. దీంతో రమ్యశ్రీ, ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడిచేసిన శ్రీధర్రావు అనుచరుడు వెంకటేశ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం పోలీసులు బందోబస్తు నడుమ మార్కింగ్ కొనసాగించారు.