పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరుగుతూండటంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా 1968 పౌర రక్షణ చట్టం మరియు నియమాల ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పౌర రక్షణ చర్యలను పెంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేకరణ కోసం పౌర రక్షణ నియమాల కింద అత్యవసర అధికారాలను ఉపయోగించాలని సూచించింది. ఈ మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. 1968 పౌర రక్షణ నియమాలలోని సెక్షన్ 11, ఇతర అంశాలతో పాటు శత్రు దాడి జరిగినప్పుడు కీలకమైన సేవల నిర్వహణను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది. 1968లో భారత పార్లమెంటు ఆమోదించిన పౌర రక్షణ చట్టం శత్రు దాడులు లేదా విపత్తుల నుండి పౌరులు, ఆస్తులు, భారత భూభాగాన్ని రక్షించడానికి అవసరమైన చర్యలను నిర్వహించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ చట్టాన్ని మే 24, 1968న ఆమోదించారు. యుద్ధం, బాహ్య దాడి, అంతర్గత అశాంతి, ఇతర శత్రు దాడుల నుండి పౌరులు, ఆస్తులు, భారత భూభాగాన్ని రక్షించడం ఈ చట్టం ఉద్దేశం. బ్లాక్అవుట్ చర్యలు, ప్రమాదకర పదార్థాల నిల్వ మరియు ఉపయోగం. వైద్య సహాయం, ఆహార సరఫరా, ఇతర అవసరమైన సేవలు , స్థానిక అధికారులను రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం వంటివి ఉన్నాయి. పౌర రక్షణ కార్ప్స్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక కంట్రోలర్ నియమిస్తుంది. దాడి సమయంలో లైట్లను నియంత్రించడం, అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి చర్యలు, జనాభాను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఖాళీ చేయించిన వ్యక్తులకు ఆశ్రయం కల్పించడం., శిక్షణ , సన్నద్ధత కోసం అభ్యాసాలు నిర్వహిస్తారు. ఈ అభ్యాసాల సమయంలో ఆస్తి లేదా వ్యక్తులకు నష్టం జరిగితే, పరిహారం చెల్లిస్తారు.
ఈ రెగ్యులేషన్లు కార్ప్స్ సభ్యుల నియామకం, శిక్షణ, విధులను నిర్దేశిస్తాయి. సైనిక బలగాలు, పోలీసు, లేదా ఇతర నిర్దిష్ట సేవలలో లేని వ్యక్తులు సాధారణంగా అర్హులు అవుతున్నారు. ఫాం ఏ ద్వారా దరఖాస్తు చేయాలి. నమోదు సమయంలో ప్రమాణం చేయాలి. విధి నిర్వహణ సమయంలో గాయాలు లేదా ఆస్తి నష్టం జరిగితే, నిర్ణీత పరిహారం చెల్లించబడుతుంది. సభ్యులు కనీసం రెండు వారాల నోటీసుతో రాజీనామా చేయవచ్చు. 1960లలో భారతదేశం బాహ్య దాడుల , అంతర్గత అశాంతుల నేపథ్యంలో, పౌర రక్షణ చర్యలను బలోపేతం చేయడానికి ఈ చట్టం తెచ్చారు. 1970లలో, ఈ చట్టం పౌరులను సమీకరించడంలో విజయవంతమయింది. కార్ప్స్ సభ్యులకు విధి సమయంలో గాయాలు లేదా నష్టం జరిగితే, నిర్దిష్ట నిబంధనల ప్రకారం పరిహారం ఇస్తారు. అయితే చట్ట ఉల్లంఘనకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.