సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సీఎల్పీ మీటింగ్ కు 10 మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ఈ మీటింగ్కు రావద్దని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల దానం నాగేందర్ ఇంట్లో భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. గురువారం మధ్యాహ్నం జరుగుతున్న సీఎల్పీ భేటీకి వారు చివరి నిమిషయంలో దూరమయ్యారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే అసెంబ్లీ సెక్రటరీ వారికి నోటీసులు జారీ చేయగా.. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున సమావేశానికి వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నారు.
ఎందుకు భేటీ..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశం జరుగుగా.. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యచరణపై చర్చించారు. ఈ సమావేశానికి 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ రెండు కూడా చారిత్రాత్మక నిర్ణయాలని.. వాటని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ ఆదేశించారు. వీటిపై రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. ఉత్తర తెలంగాణలో బీసీ కులగణన సభ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్సీ వర్గీకరణ సభలకు ఫ్లాన్ చేస్తున్నారు. ఈ సభలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు.
మేం రాలేం..!
కాగా, ఈ సమావేశానికి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. సీఎల్పీ సమావేశానికి రావాలని ఆహ్వానం పంపినా.. వారు వెళ్లలేదు. చివరి నిమిషంలో సీఎల్పీ మీటింగ్కు గైర్హాజరయ్యారు. ఫిరాయింపుల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. రెండ్రోజుల క్రితం అసెంబ్లీ కార్యదర్శి వారికి నోటీసులు కూడా జారి చేశారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ సమావేశానికి హాజరైతే చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్కు వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని.. ఫిరాయింపులకు పాల్పిడనట్లు సుప్రీం కోర్టుకు సంకేతాలు వెళ్తాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.