మొన్నటిదాకా ఉప్పూ.. నిప్పు
గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంతో కొత్త కథ
సినీ ఇండస్ట్రీలో సంబురం
మొన్నటిదాకా ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం కనిపించింది. హైడ్రా ప్రారంభంలో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వేన్షన్కూల్చివేతతో సీఎం రేవంత్కు ఇండస్ట్రీపై కొంత ఆగ్రహం ఉందనే ప్రచారం మొదలైంది. ఆ తర్వాత సంధ్య థియోటర్ఘటనలో ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్ర నటుడుగా ఉన్న అల్లు అర్జున్ను జైలుకు పంపడంతో.. ఈ రెండింటి మధ్య వైరం స్పష్టమైంది. పలు సందర్భాల్లో సీఎం కూడా కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ.. ఇండస్ట్రీపై ఫైర్ అయినట్టే కనిపించారు. ఇదే సమయంలో డ్రగ్స్ నివారణకు అండగా ఉండాలంటూ సీఎం చేసిన అభ్యర్థనను ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వానికి ఆగ్రహం మరింత పెరిగినట్లుగా మారింది. ఆ తర్వాత పరిణామాల్లో సీఎం రేవంత్ రెడ్డి కారణంగా నష్టపోయిన నాగార్జున.. సీఎంతో కలిసి మాట్లాడారు. దాంతో సయోధ్య కుదిరినట్లుగా అనిపించింది. తాజాగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో అల్లు అర్జున్కు సీఎం చేతుల మీదుగా అవార్డు ఇచ్చారు. అంతేకాదు.. అల్లు అర్జున్ కూడా తాను మాట్లాడుతున్నంత సమయం మొత్తం సీఎంకు గౌరవం ఇవ్వడమే కాకుండా.. సినిమా డైలాగ్ చెప్పే విషయంలోనూ సీఎం పర్మిషన్ తీసుకున్నారు. ఈ పరిణామాలన్నీ ఇండస్ట్రీకి కొంత ఆశలు కల్పించాయి. కానీ, ఆ తర్వాత సీఎం మాట్లాడుతూ ఇండస్ట్రీ మొత్తానికి అభయం ఇచ్చారు. దీంతో ఇప్పుడు సినిమా రంగం కొంత సంబురంలో పడింది.
మీకు అండగా నేనుంటా
హైదరాబాద్ హైటెక్స్లో “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024” ప్రదానోత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే సినిమా రంగం కూడా రాణించాలి. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, వచ్చే 10 ఏళ్ల నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మారాలంటే టాలీవుడ్ కూడా అభివృద్ధి సాధించాలి. సినిమా రంగం అభివృద్ధి సాధించడానికి పరిశ్రమకు ఏం కావాలో చెప్పాలని, ఏ హోదాలో ఉన్నా అండగా నిలబడుతా అనిసీఎం రేవంత్ రెడ్డి చిత్ర సీమకు హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమకు అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని, తెలంగాణకు ఎవరైనా రావొచ్చు. ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు. 500 ఫార్చూన్ కంపెనీల్లో 85 కంపెనీలు ఇక్కడ ఉన్నాయని పేర్కొన్నారు. సినీ పరిశ్రమపై తెలంగాణ ప్రభుత్వం గుర్రుగా ఉందని పుష్ప 2 తరువాత టాక్ నడిచింది. నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సినీ అవార్డులు ప్రకటించడంతో ఇండస్ట్రీకి కొంత ఉపశమనం లభించింది. గత పదేళ్ల సినిమాలకు గద్దర్ సినీ అవార్డులు అందజేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో నెలకొన్న భయాలు, సందేహాలను పటాపంచలు చేశాయి. హైదరాబాద్ నగరాన్ని హాలీవుడ్, బాలీవుడ్ సినిమా పరిశ్రమకు అడ్డాగా మార్చడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న 2047 విజన్ డాక్యుమెంట్లో సినీ పరిశ్రమ రాణించడానికి నిర్దేశిత లక్ష్యాలతో ఒక చాప్టర్ ఉండాలన్నారు. అందుకు సినీ ప్రముఖులు అవసరమైన ప్రణాళికను తయారు చేయాలని సూచించారు.
మేం గౌరవిస్తాం
కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కఠినంగా కనిపిస్తాయని, కానీ తెలంగాన ప్రభుత్వం సినిమా రంగాన్ని అభిమానంగా చూస్తుందని గుర్తుంచుకోవాలంటూ సీఎం స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లైంది. ఇప్పుడే కాదు గతంలోనూ మా ప్రభుత్వాలు సినిమా రంగాన్ని గౌరవించాయని, గద్దర్ స్ఫూర్తిని మా ప్రభుత్వం ముందుకు వెళుతోందని, రాష్ట్ర అభివృద్ధిలో సినీ పరిశ్రమ భాగస్వామ్యం కావాలని, అందరం కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలంటూ చెప్పిన సీఎం.. తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకునేందుకు సినీ పరిశ్రమ తోడుగా నిలవాలని, రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలంటూ కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే కూడా తాను ఉన్నానని, తమకు సినిమా ఇండస్ట్రీ గౌరవం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో వాళ్లు కూడా గౌరవంతో ఉండాలని, ప్రభుత్వం ఏదైనా చెప్తే చేయాలంటూ సూచించారు.
ఒక్క చాన్స్..!
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక అవకాశం ఇచ్చారంటూ కొత్త చర్చ మొదలైంది. గతంలో డ్రగ్స్ నివారణ విషయంలో సినిమా ప్రదర్శనకు ముందు రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియోను ప్రదర్శించాలని కోరినా.. ఎవరూ స్పందించలేదు. కానీ, ఇప్పుడు దీనిపై నిర్ణయం తీసుకునేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలు చర్చించుకుంటున్నారు. అదే విధంగా ప్రభుత్వానికి సాయంగా ఉండే పనులు కూడా చేసేందుకు సిద్ధమవుతున్నారు.