సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై అధికారులతో సమీక్ష
సిఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు మూహూర్తం ఫిక్స్ అయ్యింది. సొంత జిల్లా మహబూబ్నగర్ నుంచి రేవంత్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఈ నెల 9వ తేదీన పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా టూర్ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధిపై సిఎం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై ఆయన అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష చేయనున్నారు. కాగా, ఇటీవలే సిఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వివిధ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఇటీవల అన్ని ప్రభుత్వ శాఖల సెక్రటరీలతో భేటీ అయిన సిఎం రేవంత్ త్వరలోనే జిల్లాల పర్యటన చేపడుతానని కలెక్టర్లతో ఆయన పేర్కొన్నారు. ఇకపై తాను కూడా జిల్లాలో తిరుగుతానని రేవంత్ అధికారులతో స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాల పర్యటనకు సిఎం రేవంత్ సిద్ధం అయ్యారు. సిఎం జిల్లాల టూర్ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.