ఏర్పాట్లను పరిశీలించిన మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రికార్డు సొంతం
నిమజ్జనం ప్రక్రియ ముగిసే వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలి
జీహెచ్ఎంసి కార్మికులు, క్రేన్ ఆపరేటర్స్తో మాట్లాడిన సిఎం
గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రికార్డు సాధించారు. అసాధారణ రీతిలో స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి ట్యాంక్బండ్ వరకు కాలినడకన వెళ్లి నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించడం విశేషం. ఈ సంఘటనపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇలాంటి విధంగా ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదని, ప్రజల మనిషి అని వారు కొనియాడారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసి కార్మికులు, క్రేన్ ఆపరేటర్స్తో సిఎం మాట్లాడారు. మరోవైపు భక్తులతోనూ సిఎం ముచ్చటించారు.
నిమజ్జన క్రేన్స్ వద్ద పరిస్థితులను సిఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బంది అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మూడు షిఫ్టుల్లో డ్రైవర్స్, ఇతర సిబ్బందికి విధులు కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
నిమజ్జనం ప్రక్రియ ముగిసే వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఎప్పటికపుడు పరిస్థితులను అంచనా వేస్తూ అలర్ట్గా ఉండాలని పోలీస్ యంత్రాంగాన్ని సిఎం రేవంత్ అప్రమత్తం చేశారు. సిఎం వెంట పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.