తెలుగు చిత్ర పరిశ్రమను షేక్ చేసిన అంశాల్లో అల్లు అర్జున్ వివాదం ఒకటి. సంధ్య థియోటర్ విషాదం నుంచి ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య దూరం పెరిగింది. అంతేకాదు.. ఇండస్ట్రీపై సీఎం ఆగ్రహంతో ఉన్నారంటూ రెండు వర్గాల్లోనూ చర్చ జరిగింది. దీంతో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట, ఆ ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయాలు తెలిసినవే. దాంతో బన్నీ అరెస్ట్ జరిగింది. ‘పుష్ప 2’ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు అరెస్ట్ జరిగిందని తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు చేశారు. బన్నీ అరెస్ట్, సంధ్య థియేటర్ ఘటన పట్ల అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. అదంతా గతం! వర్తమానానికి వస్తే… బన్నీకి అవార్డు ఇచ్చారు.
నిజానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోక ముందు నుంచి ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులను ఇవ్వడం ఆపేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు ప్రభుత్వాలూ అవార్డులను నిర్లక్ష్యం చేశాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుగు సినిమాకు అవార్డులను అనౌన్స్ చేసింది. ఆ అవార్డుల్లో ‘పుష్ప 2’ సినిమాలో నటనకు అల్లు అర్జున్ కు అవార్డు వచ్చింది.
అయితే, ఇప్పుడు అవార్డు రావడం మళ్లీ చర్చకెక్కింది. గతంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు బన్నీని అరెస్ట్ చేయించారని కేటీఆర్ సహా చాలా మంది విమర్శించారు. తనకు ఎవరి పట్ల వ్యతిరేకత గానీ, వివక్ష గానీ లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బన్నీ జైలుకు వెళ్లడం పట్ల సంతాపం, సంఘీభావం వ్యక్తం చేసిన సెలబ్రిటీలు, అరెస్ట్ అయ్యాక ఆయన్ను పరామర్శించడానికి ఇంటికి వెళ్లిన సెలబ్రిటీలు ఒక్కరైనా చనిపోయిన మహిళను గానీ, ఆస్పత్రిలో ఉన్న ఆవిడ కుమారుడిని గానీ పరామర్శించారా? అని ప్రశ్నించారు. అదంతా గతం. ఇప్పుడు బన్నీకి అవార్డు ఇవ్వడంతో అతని పట్ల ద్వేషం గానీ, వ్యతిరేకత గానీ లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్టు అయ్యింది. ‘పుష్ప 2’ సినిమాలో ‘సూసేకి…’ పాడిన శ్రేయా ఘోషల్ ను ఉత్తమ గాయని పురస్కారం వరించింది.
రేవంత్… బన్నీ… ఒకే స్టేజిపై!
గద్దర్ అవార్డుల రూపకల్పనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ప్రధాన పాత్ర. అవార్డులకు పేరు సూచించినది ఆయనే అట. ముఖ్యమంత్రి హోదాలో పురస్కార గ్రహీతలకు జ్ఞాపికలు సైతం ఆయన ఇవ్వనున్నారు. సాధారణంగా అవార్డులు సీఎం ఇస్తారు. ఉత్తమ నటుడికి అవార్డు ఆయనతో ఇప్పించే అవకాశం ఉంది. సంధ్య థియేటర్ ఘటన, బన్నీ అరెస్ట్, తదనంతర పరిణామాల తర్వాత రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఒకే వేదిక మీదకు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ లో వస్తారని ఊహించవచ్చు. బన్నీతో పాటు ఆయన ఫ్యామిలీకి చెందిన ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ 2 ప్రొడ్యూస్ చేసిన ‘ఆయ్’కు మరో అవార్డు వచ్చింది.