- ఉత్కంఠ రేపుతోన్న సీఎం ఢిల్లీ టూర్
- నేడు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ తో సీఎం భేటీ
- టీపీసీసీ, నామినేటెడ్ పోస్టులపై చర్చ
- అభ్యర్ధిత్వాలపై కసరత్తు త్వరలోనే అధికారిక ప్రకటన
పీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతోన్న ఆశావాహుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతున్నది. ఈ నెల 15న రాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం.. శుక్రవారం విదేశీ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయి.. తెలంగాణలో పెట్టుబడుల అంశంపై చర్చలు జరిపారు. మరోవైపు తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధి అభిషేక్ సింఘ్వితో భేటీ అయి ఎన్నికలో అనుసరించాల్సిన వ్యవహారంపై చర్చించారు. ఇదే క్రమంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.రాహుల్ గాంధీతో భేటీ అయి పీసీసీ చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించాలని భావించారు. కానీ అనివార్య కారణాలతో భేటీ వాయిదా పడింది. దీంతో ఇప్పటికే ఆయా పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతల్లో ఉత్కంఠ పెరుగుతున్నది. ఆయా పోస్టులకు భారీగా పోటీ నెలకొనడంతో ఎవరెవరికి పదవులు వరిస్తాయోననే ఆసక్తి నెలకొన్నది. అయితే పీసీసీ అధ్యక్ష పదవికి చాలా మంది సీనియర్లు పోటీపడుతుండగా పార్టీలో కష్టపడి పనిచేసిన తమకు గుర్తింపునివ్వాలంటూ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు.
రెడ్డి సామాజికవర్గం నేత సీఎంగా ఉన్న నేపథ్యంలో పీసీసీని బీసీ వర్గానికి ఇవ్వాలని హై కమాండ్ ఆలోచిస్తోంది. దీంతో, పార్టీలో ఆ వర్గం నేతలైన మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సురేష్ షెట్కార్ పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇప్పటికే సురేష్ షెట్కార్ జహీరాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా,ఎమ్మెల్సీగా, ప్రచారకమిటీ చైర్మన్గా ఉన్నారు. మహేష్ కుమార్గౌడ్కి అందరినీ కలుపుకొని పోయే నేతగా, సీఎం రేవంత్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్నది. అయితే ఏఐసీసీ స్థాయి పరిచయాలు అంతగా లేకపోవడంతో ఆయన పీసీసీ రేసులో వెనకబడ్డారనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు.. మధుయాష్కీ గౌడ్కి ఏఐసిసి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
ఇదీలావుంటే..
ఈసారి తమకు పీసీసీ చీఫ్ కేటాయించాలంటూ ఎస్సి, ఎస్టీ సామాజిక వర్గ నేతలూ పట్టుబడుతున్నారు. ఈ కేటగిరిలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ పేర్లు తెరమీదికొచ్చాయి. ఇందులో బలరాం నాయక్ తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని స్పష్టం చేశారు. ఒకవేళ ఎస్సి సామాజిక వర్గానికి అధిష్టానం అవకాశం కల్పించాలని అనుకుంటే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరూ హైకమాండ్ వద్ద పదవికోసం పట్టుబట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే.. శ్రావణమాసం ముగిసేలోపు పీసీసీ చీఫ్ ను నియమించాలని ఏఐసీసీ భావిస్తున్నది.మరోవైపు.. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా సంపత్ కుమార్ల పేర్లు కూడా ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతున్నది. పీసీసీ పదవులతో పాటు,కార్పొరేషన్ పదవుల పంపకాన్ని కూడా పూర్తి చేయాలనుకుంటున్న ఏఐసీసీ ఆ మేరకు ఆచితూచీ వ్యవహరిస్తున్నది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే రాష్ట్రంలో 36 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ నెలాఖరులోపే మరో 25కుపైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తొలి దఫాలో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు కలిపి 36 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అప్పగించారు. ఆ జాబితాలో చోటుదక్కని చాలా మంది రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో సీనియర్లతో పాటు విద్యార్థి సంఘ నాయకులు, అధికార ప్రతినిధులు, మహిళా నేతలు ఉన్నారు. మరోవైపు.. రెండో విడత నామినేటెడ్ పదవుల జాబితాలో పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు కీలక కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కనున్నట్టు కూడా చర్చ జరుగుతోంది.
ఆర్టీసీ, సివిల్ సప్లైస్, మూసీ రివర్ఫ్రంట్ వంటి ముఖ్యమైన కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు అప్పగిస్తారని..సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గంలో స్థానం దక్కనివారికి చైర్మన్ పదవులతోపాటు కేబినెట్ హోదా కల్పించాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఇక బేవరేజెస్ కార్పొరేషన్, వైద్య మౌలిక సదుపాయాల కల్పన, హ్యాండ్లూమ్స్, గీత కార్పొరేషన్ తదితర పోస్టులు కూడా ముఖ్య నేతలకు అప్పగించనున్నట్టు సమాచారం. వీటితో పాటు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు కూడా ఈసారి చైర్మన్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వైశ్య కార్పొరేషన్కు మాత్రమే చైర్మన్ను ప్రకటించగా.. మిగతా కులాల కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను ప్రకటించాలని టీపీసీసీ నాయకత్వంపై ఒత్తిడులు వస్తున్నాయి.