మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎపిజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. శనివారం సిఎం నివాసంలో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి కలాం చిత్రపటానికి సిఎం రేవంత్ పుష్పాంజలి ఘటించారు. దేశం కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు స్వర్గీయ కలాంఅని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఒక శాస్త్రవేత్తగా భారత రక్షణ పరిశోధనా రంగంలో, అంతరిక్ష పరిశోధనా రంగంలో కలాం చేసిన కృషిని దేశం ఎప్పటికీ విస్మరించబోదని సిఎం పేర్కొన్నారు. తన రచనలతో యువతలో దేశ సేవ పట్ల స్ఫూర్తి నింపిన మహనీయుడు కలాం అని సిఎం రేవంత్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి చామల కిరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.