- సభ్యులుగా రెవెన్యూ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ మంత్రులు,
- సిఎస్, డిజిపి, ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ మేయర్లు
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్, రెస్పాన్స్ అండ్ అసెట్స్) చైర్మన్గా సిఎం రేవంత్ రెడ్డి వ్యవహారించనున్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. అందులో సభ్యులుగా రెవెన్యూ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ మంత్రులు వీరితో పాటు సిఎస్, డిజిపి, ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ మేయర్లు ఉండనున్నారు. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు ఆస్తుల పరిరక్షణ, విప్తతు సంరక్షణపై హైడ్రా పనిచేయనుంది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని అధికారులను సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇంతకుముందు ఉన్న ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం పేరును హైడ్రాగా మార్చి కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ వింగ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ పరిధిలోనే పనిచేయనుంది. జీహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ హైడ్రా పని చేయాలని అందుకు తగ్గట్టు దాని వ్యవస్థాగత నిర్మాణం, విధి, విధానాలు ఉండాలని ప్రభుత్వం సూచించింది.
డిఐజీ స్థాయి అధికారి డైరెక్టర్గా….
కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలను పరిరక్షించడం, నాలాలు, ప్రభుత్వ భూములు, స్థిరాస్థులు కబ్జాకు గురికాకుండా, అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టేలా ‘హైడ్రా’ నిరంతరం పర్యవేక్షించనుంది. అదేవిధంగా పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీల నియంత్రణ, వాటర్ పైపులైన్లు, కరెంట్ సరఫరా లైన్లు, డ్రైనేజీ, వరద నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ లాంటి సేవల్లో ఇక నుంచి ‘హైడ్రా’ భాగస్వామ్యం కానుంది. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 మేజర్ పంచాయతీలు ‘హైడ్రా’ ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి. ఈ సంస్థకు డిఐజీ స్థాయి అధికారి డైరెక్టర్గా, ఎస్పీ స్థాయి అధికారులు అదనపు డైరెక్టర్లుగా నియామకం కానున్నారు.