నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం ప్రకటన
రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు, అనుమతులు, విభజన హామీల అమలుపై మోదీ సర్కార్ పూర్తి వివక్ష చూపిందని సీఎం విమర్శించారు. ప్రస్తుతం బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించారు. కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 27న జరిగే నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్న సీఎం ప్రకటించారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఊసెత్తకపోవడం, నిధుల ప్రస్తావన లేకపోవడంపై బుధశారం జరిగిన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్రప్రభుత్వం వివక్ష చూపిందని విమర్శించిన సీఎం కేంద్రబడ్జెట్ను సవరించి తెలంగాణకు నిధులివ్వాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ సర్కార్ తీరుని తప్పుపట్టిన సీఎం రేవంత్.. బడ్జెట్లో మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ, ఈనెల 27న జరిగే నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సభలో వెల్లడించారు. పార్టీలకతీతంగా రాష్ట్రప్రయోజనాల కోసం ఒకేతాటిపైకి వచ్చి కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవాలని స్పష్టం చేశారు.
ఇస్తున్నదెంత.. వస్తున్నదెంత
రాష్ట్రం పన్నుల రూపంలో ఒక రూపాయి కేంద్రానికి చెల్లిస్తే, రాష్ట్రానికి తిరిగి ఇస్తుంది 47 పైసలు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అదే బిహార్ రాష్ట్రం ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే, తిరిగి రూ.7.26 వస్తున్నాయని, పార్టీల, వ్యక్తులు ప్రయోజనాలు కోసమే కొంత మంది సభ్యులు మాట్లాడటం శోచనీయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కుల కోసం, రాష్ట్రానికి రావల్సిన నిధుల కోసం అందరం ఏకాభిప్రాయానికి వచ్చి, ఒక్కతాటిపైకి నిలబడితే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మనకు కావల్సిన హక్కులను సాధించుకోవడం పెద్ద సమస్య కాదని సీఎం రేవంత్ హితవు పలికారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, అన్ని రాష్ట్రాల సమీకృత, సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ, ఫెడరల్ స్ఫూర్తిని విస్మరించిందని తీర్మానం చేసినట్లు వివరించారు. బడ్జెట్లో తెలంగాణకు వివక్ష జరిగిందని, రాష్ట్రావిర్భావం నుంచి ఇదే ధోరణి కొనసాగించిందని తీర్మానంలో పేర్కొన్నారు.
పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని తీర్మానంలో తెలిపారు. అయితే విభజన చట్టంలోని హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడంతో రాష్ట్ర ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపిందని తీర్మానంలో ప్రస్తావించింది. సీఎం, మంత్రులు పలుమార్లు ప్రధానిని, మంత్రులను కలిసి, వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం, చట్టప్రకారం రావల్సిన నిధులతో పాటు అపరిష్కృతంగా ఉన్న అనేక అంశాలను కోరినప్పటికీ కేంద్రం పట్టించుకోకుండా వివక్ష చూపిందని శాసనసభ అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన తీరుపై అసంతృప్తిని, నిరసన తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తమ రాష్ట్రానికి న్యాయం జరిగేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. కాగా, ఈ తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలపగా, బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.