Friday, October 18, 2024

మూసీ పరీవాహక ప్రాంతాల్లో మూడు నెలలు ఉండండి…?

  • అక్కడే ఉండి రాజకీయం చేయండి
  • మీరు మూడు నెలలు అక్కడే ఉంటే ఈ ప్రాజెక్టును ఆపేస్తా
  • దానికి అయిన ఖర్చును నా సొంత ఆస్తులను అమ్మి చెల్లిస్తా
  • కెటిఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌లకు సిఎం రేవంత్‌రెడ్డి సవాల్
  • మూసీ సుందరీకరణ కాదు మూసీ నదిని పునరుజ్జీవన చేస్తున్నాం
  • మూసీ పునరుజ్జీవనానికి ఐదు కంపెనీలతో టెండర్ అగ్రిమెంట్ కింద
  • 141 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్నాం
  • మూసీ విషం, నల్గొండను మింగుతోంది

‘మూసీ పరీవాహక ప్రాంతాల్లో పేదలు ఖాళీ చేసిన ఇళ్లల్లో మూడు నెలలు మీరు ఉండండి, మీరుంటే ఆ అద్దెను నేనే కడతాను, మూడు నెలలు అక్కడే ఉండి రాజకీయం చేయండి’ మీకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశిస్తా. మీరు మూడు నెలలు అక్కడే నివాసం ఉండగలిగితే ఈ ప్రాజెక్టును అర్ధాంతరంగా ఆపేస్తామని, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కెటిఆర్, హరీష్‌రావు, బిజెపి ఎంపి ఈటల రాజేందర్‌లకు సిఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఙప్తి చేశారు. మూసీ ప్రక్షాళన ఆపేస్తామని ఒకవేళ టెండర్ అగ్రిమెంట్‌కు నష్టం జరిగితే నా సొంత ఆస్తి అమ్మి కడతానని సిఎం రేవంత్ సవాల్ చేశారు. అంతేకాదు మూసీ ప్రాజెక్టుకు సంబంధించి చర్చించడానికి అసెంబ్లీలు సమావేశాలు పెడదామని విపక్షాలు సలహాలు, సూచనలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. మీరు ఎన్ని రోజులంటే అన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు పెడతానని ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోనే అనుమానాలు అన్నీ బయటపెట్టండి. ప్రతి ప్రశ్నకు తానే స్వయంగా సమాధానం చెబుతానని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై చర్చకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను కూడా ఏర్పాటు చేయిస్తానని సిఎం పేర్కొన్నారు. న్యాయ కోవిదుల సలహాలు తీసుకొని రాష్ట్ర ఎంపిలను కూడా భాగస్వామ్యం చేయిస్తానని సిఎం అన్నారు. గురువారం సచివాలయంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మూసీ ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు.

శనివారం వరకు ప్రతిపక్షాలకు గడువు
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు మూసీ నది పునరుజ్జీవనమని సిఎం రేవంత్ తెలిపారు. మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. ఇందులో అందరినీ మమేకం చేసే ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. మీడియా కూడా ఈ విషయంలో తప్పుదోవ పట్టిందన్నారాయన. ఈ శనివారం వరకు ప్రతిపక్షాలకు ఆయన గడువిచ్చాడు. మీ సలహాలేమిటీ, ప్రభుత్వం ఇంకా ఏమి చేయాలి..? అనే విషయాలపై నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సిఎం రేవంత్ సూచించారు. మూసీనది కాలుష్యానికి ప్రతీకగా మారిందని ఆయన వాపోయారు. 1,600కు పైగా నివాసాలు పూర్తిగా మూసీనది గర్భంలో ఉన్నాయని నిర్వాసితులకు రెండుపడక గదుల ఇళ్లు కేటాయించి ఆదుకుంటామని సిఎం రేవంత్ భరోసా ఇచ్చారు.

త్వరలో మీడియా సంపాదకులతో భేటీ అవుతా
త్వరలో మీడియా సంపాదకులతో కూడా ఈ విషయమై భేటీ అవుతానని, వారి సలహాలు తీసుకుంటానని సిఎం రేవంత్ తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ వేసి పర్యావరణ వేత్తల సలహాలు కూడా తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నాయకులంతా ఈ కేబినెట్ సబ్ కమిటీలో తమ అభిప్రాయాలు వెల్లడించ వచ్చన్నారు. మూసీ పరివాహాక ప్రాంత ప్రజలను నిరాశ్రయులను, అనాథలను చేయడం తమ ఉద్దేశ్యం అసలే కాదన్నారు. వారికి మంచి జీవితాలు ప్రసాదించడంతో పాటు పరిహారం, ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమన్నారు. మూసీ పునరుజ్జీవం ద్వారా టూరిజం డెవలప్‌మెంట్ అవుతుందని, తద్వారా ఆదాయంపెరుగుతుందన్నారు. ఆదాయం పెరిగినప్పుడే ప్రభుత్వానికి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు వీలవుతుందని సిఎం తెలిపారు.

ప్రపంచంలోని ఐదు బెస్ట్ కంపెనీలతో డిపిఆర్ రిపోర్టు
మూసీనది పునర్జీవనం కోసం 141 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఐదు బెస్ట్ కంపెనీలను డిపిఆర్ (డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేపిస్తున్నామని ఆయన తెలిపారు. మూసీపై ప్రతిపక్షాలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాయని, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయంటూ బిఆర్‌ఎస్ పార్టీ నేతలపై సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

18 నెలల్లో డిపిఆర్ రిపోర్టు
మూసీ నది పునర్జీవనం విషయంలో పెట్టుబడుల ఆహ్వానం, రుణాల సేకరణ, వంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి గ్రౌండ్ రియాల్టీని అంచనా వేయటానికి ఈ ఐదు కంపెనీలను ఎంపిక చేసినట్లు సిఎం వెల్లడించారు. ఈ ఐదు కంపెనీలు గ్లోబల్ సమ్మిట్స్, సెమినార్లు నిర్వహించి వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను హైదరాబాద్ తీసుకురావటానికి పెట్టుబడులు పెట్టడానికి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా సహాయ సహకారాలు అందిస్తాయని సిఎం తెలిపారు. ఈ ఐదు కంపెనీలు ప్రాజెక్టు రిపోర్ట్‌పై నిరంతరం సలహాలు, సూచనలు ఇవ్వటానికి 18 నెలలు పని చేస్తాయని ఆ తర్వాత మూసీ నది పునర్జీవనం ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు మరో ఐదు సంవత్సరాలు పని చేస్తాయని ఆయన తెలిపారు. మూసీ పునర్జీవం తర్వాత వచ్చే పెట్టుబడులు, నిధుల సేకరణ వంటి అన్ని అంశాలపై ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు ఇవ్వటంతో పాటు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా ఈ కంపెనీలు వ్యవహారిస్తాయని సిఎం వివరించారు. ఈ ఐదు కంపెనీలతో టెండర్ అగ్రిమెంట్ కింద 141 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్నట్లు సిఎం వివరించారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని సిఎం బిఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు.

నల్గొండ వాళ్లు మౌనంగా ఉండటం బాధిస్తోంది?
నల్గొండ వాళ్లు మౌనంగా ఉండటం బాధిస్తోంది. ఎవరి కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం..? మూసీ విషం, నల్గొండను మింగుతోంది. మూసీ మురికితో నల్గొండలో పాలు, కూరగాయలు కొనడం లేదని సిఎం రేవంత్ రెడ్డి వాపోయారు. చెన్నై, బెంగుళూరులు వర్షాలకు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. చెరువులను ఆక్రమించు కోవడం వల్ల బెంగుళూరు ఏ పరిస్థితికి వచ్చిందో మనం చూస్తున్నామని ఆ పరిస్థితి మనకు రాకూడదన్న ఉద్ధేశ్యంతోనే తాము మూసీకి పునరుజ్జీవనం అందించాలని నిర్ణయించామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

మన పిల్లలకు మూసీ పేరు ఎందుకు పెట్టడం లేదు…?
ఒక తెలంగాణ కవి తన నలుగురు కూతుర్లకు గంగ, యమునా, సరస్వతీ, కృష్ణవేణి అని పేర్లు పెట్టుకున్నారు. మన మూసీ నది పేరు పెట్టుకోకపోవడానికి గత పాలకులు కాదా? ఈ ద్రోహాన్ని ఇలాగే కొనసాగిద్దామా..? దేశ ద్రోహం కంటే ఇది పెద్ద నేరం కాదా అని సిఎం ప్రశ్నించారు. హీరోషిమా, నాగసాకిల్లో పడిన అణుబాంబు కంటే మూసీ ఆక్రమణ ప్రమాదకరమని సిఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

మిడ్‌మానేరు ముంపు బాధితులకు ఇళ్లు ఇస్తామని మోసం చేసింది బిఆర్‌ఎస్
మల్లన్నసాగర్, కొండపోచమ్మ బాధితులను దుర్మార్గంగా రాత్రికి రాత్రి ఖాళీ చేయించింది బిఆర్‌ఎస్ నాయకులని సిఎం రేవంత్ ఆరోపించారు. కొండపోచమ్మ ప్రాజెక్టులో మునిగిన 14 గ్రామాల్లో ఏ ఒక్కరికైనా గత ప్రభుత్వం ఇండ్లు ఇచ్చిందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు? మిడ్ మానేరు ముంపు బాధితులకు ఇండ్లు ఇస్తామని మోసం చేసింది బిఆర్‌ఎస్ నాయకులని, కానీ, తాము అలా చేయడం లేదని ఆయన ఆరోపించారు. బఫర్ జోన్‌లో ఉన్న 10వేల కుటుంబాలకు కూడా పునరావాసం కల్పిస్తామని సిఎం పేర్కొన్నారు. ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం విపక్షాలకు ఇష్టం లేదా? అని రేవంత్ ప్రశ్నించారు. చరిత్ర కాలగర్భంలో మూసీని సమాధి చేయదలచుకున్నారా? మేం ఉండేది ఐదేళ్లా, పదేళ్లా అనేది ప్రజలు నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. ఉప్పెనలా వరదలు వస్తే నగరమే మిగలదని, ఇదేమైనా గజ్వేల్ ఫాంహౌసా, లేక ధరణి లాంటి మాయజాలమా? ఎవరినో మోసం చేసి ఏదో చేయాలన్న ఆలోచన తనకు లేదని, మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో తన స్వార్థం లేదని, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచడమే తమ ప్రభుత్వ ఆలోచన అని సిఎం రేవంత్ అన్నారు.

పరీవాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం
నగరం మధ్యలో నుంచి నది ప్రవహించే నగరం దేశంలోనే లేదని, అలాంటి నగరం పాలకుల నిర్లక్ష్యంతో మురికి కూపంగా మారిందని సిఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము మూసీకి పునరుజ్జీవనం అందిస్తామని, మూసీ విషయంలో చరిత్ర హీనులుగా మిగలకూడదని మంచి ప్రణాళికను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. నదీగర్భంలో నివసిస్తున్న వారి గురించి ఆరు నెలల నుంచి అధికారులు సర్వే చేశారని, 1,600 ఇళ్లు నదీగర్భంలో ఉన్నాయని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం సర్వే చేసిందని ఆయన తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అన్న దానిపై దృష్టి సారించామని ఆయన అన్నారు.

నెహ్రూ, రాజీవ్, పివి ముగ్గురు ప్రధానుల వల్ల దేశం అభివృద్ధిలో….
ప్రపంచంలో ఎక్కడ మేధావులు అవసరమైనా మనదేశం నుంచే ఎగుమతి చేస్తున్నామని అది కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని సిఎం రేవంత్ అన్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ కారణమని ఆయన తెలిపారు. కంప్యూటర్‌తో ఉద్యోగాలు, ఆదాయాలు పెరిగాయని, కాంగ్రెస్ విజన్‌తోనే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. అప్పటి ప్రధాని పివి నరసింహా రావు సరళీకృత విధానాలతో ప్రపంచంలోని దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన తెలిపారు. నెహ్రూ, రాజీవ్, పివి ముగ్గురు ప్రధానుల వల్ల దేశం అభివృద్ధి బాటలో నడిచిందని సిఎం రేవంత్ చెప్పుకొచ్చారు.

నగరం నాశనమవుతున్నా రాజకీయాలే ముఖ్యమా..?
చినుకు పడితే చాలు హైదరాబాద్ మొత్తం చిత్తడిగా మారుతోందన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోందని, వరదనీరు ఇళ్లలోకి వస్తోందని, ఈ కారణంగా ప్రజలు తరుచూ ప్రభుత్వంపై మండిపడటం సాధారణంగా మారిందన్నారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు మళ్లీ రాకూడదని తాము ప్రయత్నాలు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇంతటి గొప్ప పనులు తాము చేస్తుంటే ప్రజల్లో అపోహలు సృష్టించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని సిఎం రేవంత్ మండిపడ్డారు. హైదరాబాద్ సర్వనాశనం అవుతున్నా రాజకీయాలే ముఖ్యమయ్యాయా? అని విపక్షాలను ఆయన ప్రశ్నించారు. దీనిపై అందరూ (ప్రజలు) ఒప్పుకుంటేనే ముందుకు వెళ్తామన్నారు. తాను కెప్టెన్ లాంటోడినని ప్లేయర్స్ వద్దు అంటే ఆపేస్తానని సిఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు.

నాలుగు యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని
విప్లవాత్మక నిర్ణయాలను అడ్డుకునే, వ్యతిరేకించే వాళ్లు అడుగడుగునా ఉంటారని సిఎం రేవంత్ అన్నారు. వారిని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్లలేమని ముఖ్యమంత్రి తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివిసించే వారి వివరాలు సేకరించామని దుర్భర స్థితిలో ఉన్నవారికి మెరుగైన జీవితాన్ని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని సిఎం హామీ ఆయన ఇచ్చారు. తాము నిద్రాహారాలు మాని పనిచేసేది అద్దాల కోసం కాదు అందాల భామల కోసం కాదు. రాష్ట్ర భవిష్యత్ కోసమని ఆయన వెల్లడించారు. నాలుగు యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని అధికారంలోకి రావాలనుకోవడం కలే అవుతుందని బిఆర్‌ఎస్‌ను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. దుబాయ్ వెళ్లి జుట్టుకు నాట్లు వేయించుకునే వాళ్ల కోసం కాదు మూసీ సుందరీకరణ అని బిఆర్‌ఎస్ నాయకులపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు.

చర్చించడానికి గజ్వేల్ లేదా వేములవాడకు వస్తా మీరు సిద్ధమేనా…?
బందిపోటు దొంగళ్లా పదేళ్లు రాష్ట్రాన్ని పీడించి దోచుకున్నారని బిఆర్‌ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయాల్సిన అవినీతి మొత్తం చేశారని సిఎం ఆరోపించారు. ఇప్పుడు తాము మూసీకి జీవం పోస్తుంటే చూస్తూ ఓర్వలేకపోతున్నారని సిఎం ఎద్దేవా చేశారు. కళ్లమంటతోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్చించడానికి తాను సిద్ధమని గజ్వేల్ అయినా వస్తా, వేములవాడకైనా వస్తా, కిష్టాపూర్‌కు అయినా వస్తా, సెక్యూరిటీ లేకుండా వస్తా సిద్ధమా? అని బిఆర్‌ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ సవాల్ చేశారు. మూసీ మొత్తం 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సర్వమతాలకు ప్రతీక మూసీనది అని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొ న్నారు.

చిన్న వయస్సులోనే అన్ని వచ్చాయి… నాకు ఇంకా ఆశ లేదు…
తాము చేసేది మూసీ సుందరీకరణ కాదని, మూసీనది పునర్జీవనమని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ బ్యూటిఫికేషన్ అంటూ బిఆర్‌ఎస్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తోందని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబ్ ఛానెళ్లు పెట్టి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. చిన్న వయస్సులోనే నాకు అన్ని వచ్చాయని, నాకు ఇంకా ఆశ లేదని సిఎం తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే మూసీ ప్రాజెక్ట్ పునర్జీవనం చేపట్టామని ఆయన క్లారిటీ ఇచ్చారు. మేం పని చేసేది అద్దాల మేడలు, అందాల భామల కోసం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసమని ఆయన తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలు ఎప్పటికీ బాగుపడొద్దన్నదే బిఆర్‌ఎస్ పార్టీ లక్ష్యమని సిఎం విమర్శించారు.

దేశ భద్రతను వ్యతిరేకించిన వాళ్లు కసబ్ కంటే….
దామగుండంలో నిర్మించనున్న నేవీ రాడార్ స్టేషన్ విషయంలోనూ బిఆర్‌ఎస్ రాజకీయాలు చేస్తోందని సిఎం అసహనం వ్యక్తం చేశారు. దేశ భద్రతను వ్యతిరేకించిన వాళ్లు టెర్రరిస్ట్ కసబ్ కంటే చరిత్రహీనులని ఆయన విమర్శించారు. రాడార్ స్టేషన్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందే బిఆర్‌ఎస్ అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వాళ్లు దిగిపోయే నాటికి అన్ని అనుమతులు ఇచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ భద్రతను కూడా రాజకీయాలకు ముడిపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. లక్షల ఎకరాలు కాలుష్యం చేయాలని చూసిన వాళ్లు రాడార్ సెంటర్ గురించి మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. దేశ ప్రయోజనాల కోసం పెట్టే ప్రాజెక్టును ఎలా అడ్డుకుంటామని ఆయన ప్రశ్నించారు. 12 లక్షల చెట్లు పోతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వందలు, వేలల్లోనే చెట్లు పోతున్నాయని సిఎం చెప్పారు. ఆ చెట్లకు ఐదింతలు మొక్కలు నాటుతారని సిఎం తెలిపారు. దామగుండంలో ఏర్పాటు చేసేది లో ఫ్రీక్వెన్సీ రాడార్స్ సిస్టమ్ అని దాని రేడిషియేషన్ ఏమి అంతా ప్రమాదకరంగా ఉండదన్నారు. ఇలాంటిదే తెలంగాణ పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా ఉందని ఆయన గుర్తు చేశారు.

మూసీ వైపు హైడ్రా కన్నెత్తి చూడలేదు
మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టిందన్న వార్తలకు సిఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతం వైపు హైడ్రా కనీసం కన్నెత్తి చూడలేదని ఆయన స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఒక్క ఇటుక పెళ్ల కూడా కూలగొట్టలేదని ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడంతో బాధితులే వారి ఇళ్లను కూలగొట్టారని సిఎం వివరణ ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మోసం చేయడంలో రేవంత్ రెడ్డి ఘనుడు అన్న మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular