-
సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలని తల్లిదండ్రుల అభ్యర్థన
ఫిట్జీ కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. ఆర్థిక, పాలనాపరమైన సవాళ్లు, నిధుల మళ్లింపు ఫలితంగా గత కొన్ని నెలలుగా టీచర్లకు జీతాలు చెల్లించలేకపోవడంతో సరిగ్గా కీలకమైన బోర్డు, ప్రవేశ పరీక్షల సమయంలో కోచింగ్ కేంద్రాలను మూసివేయడంపై వేలాది మంది విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ట్యూటర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఫలితంగా బోర్డు, ప్రవేశ పరీక్షల ముందు వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళణలో ఉన్నారు. ఇంజినీరింగ్, నీట్ వంటి ప్రవేశ పరీక్షల కోచింగ్, విద్యార్థుల ఫౌండేషన్ ప్రోగ్రామ్స్లలో పేరొందిన ఎఫ్ఐఐటీజేఈఈ (ఫోరం ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్- ఫిట్జీ) సెంటర్లు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మూతపడ్డాయి. ఢిల్లీ, మేరట్, ఘజియాబాద్, లఖ్నవూ, వారాణసీ, ఇండోర్, భోపాల్, పాట్నా, పుణే, హైదరాబాద్లో ఆ సంస్థ కోచింగ్ సెంటర్లను మూసివేశారు. ఆర్థిక, పాలనాపరమైన సవాళ్లు, గత కొన్ని నెలలుగా టీచర్లకు జీతాలు చెల్లించలేకపోవడమే ఇందుకు కారణం. కోచింగ్ కేంద్రాలను మూసివేయడంపై వేలాది మంది విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఫిట్జీ సెంటర్ల ముందు ధర్నాలు చేశారు.
అన్యాయం జరిగింది
ఇటీవల 100 మందికి పైగా విద్యార్థుల ఫిర్యాదు మేరకు భోపాల్లో ఫిట్జీ సెంటర్పై కేసు నమోదైంది. దీంతో కోచింగ్ సెంటర్ లైసెన్స్ను అక్కడి యంత్రాంగం రద్దు చేసింది. తాజాగా హైదరాబాద్లోని రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు అందింది. గత ఏడాది జూన్లో తాను రెండేళ్లకు సంబంధించి రూ.4 లక్షల ఫీజును చెల్లించానని, ఇప్పుడు కోచింగ్ సెంటర్ను మూసివేయడంతో ఇంజినీర్ కావాలనే తన కుమార్తె కలపై ప్రభావం పడుందని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి సంపాదించి కట్టిన ఫీజును తిరిగివ్వాలని లేదా మిగిలిన కోర్సును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
నిధులు మళ్లింపు ఆరోపణలు
ఫిట్జీ సంస్థపై నిధులు మళ్లింపు ఆరోపణలు కూడా ఉన్నాయి. కోచింగ్ కార్యకలాపాల నిధులను ఇతర మార్గాలకు మళ్లించడంతో ఆ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, దీని వలన ఇన్వెస్టర్లు, టీచర్లు గుడ్బై చెబుతున్నారనే చర్చ నడుస్తోంది. లైసెన్స్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు అధికారులు చర్యలు కూడా తీసుకున్నారని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. మరోవైపు ఫిజిక్స్ వాలా, అన్అకాడమీ వంటి కొత్త సంస్థల నుంచి కూడా ఫిట్జీ విపరీతమైన పోటీ ఎదుర్కొంటోంది. ఐఐటీ ఢిల్లీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన డీకే గోయల్ అనే వ్యక్తి మూడు దశాబ్దాల క్రితం ఎఫ్ఐఐటీజేఈఈ సంస్థను స్థాపించారు. ఫిట్జీ సంస్థకు దేశవ్యాప్తంగా 41 నగరాల్లో 72 కోచింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 300 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు అవన్నీ మూతపడ్డాయి.
దేశ వ్యాప్తంగా ఆందోళనలు
ఫిట్జీ సెంటర్ల మూసివేతతో వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఫీజులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంస్థకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోనూ ఆందోళన చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ సంస్థలోని ఉపాధ్యాయుల వార్షిక ఆదాయం రూ. 15 లక్షల నుండి రూ. 2 కోట్ల మధ్య ఉండేది. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో చాలా కేంద్రాల్లో వారంతా సామూహిక రాజీనామాలు చేశారు. అయితే, ఫిట్జీకి ఈ సంస్థ నుంచి వచ్చిన నిధులను కోచింగ్ సెంటర్లకు కాకుండా ఇతర వ్యాపారాలకు మళ్లించిందని ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు పెట్టడం లేదు. ముందుగా ఈ సంక్షోభం నోయిడా, ఘజియాబాద్, మీరట్, భోపాల్ నుంచి మొదలైంది. ఈ ప్రధాన నగరాల్లో కోచింగ్ కేంద్రాలు మూసివేశారు. ఆ తర్వాత టీచర్లు లేకపోవడంతో.. చాలా సెంటర్లలో తరగతులు నిర్వహించలదు. ఫలితంగా తల్లిదండ్రులు దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలు చేశారు.
ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫిట్జీ మూసివేతలు, తల్లిదండ్రుల నిరసనలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. దీంతో సోమవారం ఫిట్జి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తమ సెంటర్లను మూసివేస్తున్నట్లు మెస్సేజ్ విడుదల చేసింది.