Tuesday, October 1, 2024

పది నెలల్లోనే 11,062 టీచర్ల భర్తీకి తాము కృషి చేశాం

డిఎస్సీ ఫలితాలను కేవలం 55 రోజుల్లోనే వెల్లడించాం
1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది
అక్టోబర్ 9వ తేదీన ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందచేస్తాం
గత ప్రభుత్వం గ్రూప్ 1,2,3 పోస్టులను అంగడి సరుకుల్లా మార్చింది
డిఎస్సీ ఫలితాలను విడుదల కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి

పది నెలల్లోనే 11,062 టీచర్ల భర్తీకి తాము కృషి చేశామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే 30 వేల ఉద్యోగ పత్రాలు అందజేశామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతుందని సిఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తీవ్రమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం గ్రూప్ 1,2,3 పోస్టులను అంగడి సరుకుల్లా మార్చిందని ఆయన విమర్శించారు. టీచర్ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం కాదని, అది భావోద్వేగమన్నారు.

మొదటి ఏడాదిలోనే 65 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా సిఎం రేవంత్ గుర్తుచేశారు. సచివాలయంలో సోమవారం సిఎం రేవంత్ రెడ్డి డిఎస్సీ ఫలితాలను విడుదల చేశారు. మొదటగా జనరల్ ర్యాంక్ జాబితాను ఆయన విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్చి 1వ తేదీన 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా, జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా ఈ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారని ఆయన తెలిపారు. డిఎస్సీ ఫలితాలను కేవలం 55 రోజుల్లోనే ఇచ్చామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని ఆయన తెలిపారు. దసరాలోపు ఎల్బీస్టేడియంలో నియామకపత్రాలు అందజేస్తామని సిఎం రేవంత్ హామీ ఇచ్చారు. పదేళ్లలో గత ప్రభుత్వం ఒకే డిఎస్సీ ఇచ్చిందని అది కూడా 7వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.

త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేస్తాం
టెట్ తర్వాతనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. విద్యాశాఖ అధికారులు తక్కువ సమయంలో ఉద్యోగాల భర్తీకి కృషి చేశారని వారికి సిఎం అభినందనలు తెలిపారు. 26 ఆప్షన్ కింద డిఎస్సీ నిర్వహించామని ఆయన వివరించారు. 1:3 ప్రాతిపాదికన సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానం నిర్వహించామన్నారు. దసరాలోగా అక్టోబర్ 9వ తేదీన ఈ ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని సిఎం స్పష్టం చేశారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒకే ఒక్క నోటిఫికేషన్ వేసిందని ఆయన మండిపడ్డారు.మాజీ సిఎం కెసిఆర్ కేవలం 7,857 టీచర్లను మాత్రమే నియమించారని ఆయన చెప్పారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరి వల్ల పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గురుకులాల గురించి కెసిఆర్ చెప్పారని, కానీ, మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం కోళ్ల షెడ్‌లు, అద్దె గృహాల్లో వసతిగృహాలను ఏర్పాటు చేసిందని సిఎం ఆరోపించారు. ప్రస్తుతం ఆయా వసతిగృహాల్లో ఎదురవుతున్న సమస్యలపై కొన్ని పార్టీలకు చెందిన మీడియాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. విద్య మీద పెట్టేది ఖర్చు కాదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతుందని సిఎం రేవంత్ హామీ ఇచ్చారు.

100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించుకుంటాం
100 నియోజకవర్గాల్లో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు సిఎం రేవంత్ ప్రకటించారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రభుత్వం పాఠశాలలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పదేళ్లలో కెసిఆర్ టీచర్ల పదోన్నతులు, బదిలీలు ఎందుకు చేయలేదని నిలదీశారు. దీనివల్ల టీచర్లలో నిరాశ ఏర్పడిందని ఆయన చెప్పారు. 36వేల మంది టీచర్ల బదిలీలను ఎలాంటి విమర్శలు లేకుండా తాము పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదని దాని వల్ల కొంత సమస్యలు వచ్చాయని సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ, విద్యా శాఖ కమిషనర్ ఈవీ నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular