ఏసిబి, విజిలెన్స్ అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైడ్రా పేరు చెప్పి కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హైడ్రా పేరుతో నోటీసులు ఇచ్చి భయపెట్టి డబ్బులు వసూలు చేసే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసిబి, విజిలెన్స్ అధికారులను సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు, మూడేళ్ల క్రితం వచ్చిన ఫిర్యాదులను అడ్డం పెట్టుకొని కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి.
ఈ అంశంపై సిఎం తీవ్రంగా స్పందించారు. హైడ్రా పేరుతో, నోటీసుల పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారుల వివరాలను సైతం ఏసిబి, విజిలెన్స్ అధికారులకు ఇవ్వాలని సిఎం సూచించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.