సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి
ఇస్కాన్ టెంపుల్ జగన్నాథ రథ యాత్రను ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ స్టేడియం వద్ద అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించే జగన్నాథ రథయాత్రను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి భక్తులనుద్ధేశించి మాట్లాడుతూ…ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని ప్రశంసించారు.
ఈ ప్రభుత్వం అందరిదని, సర్వమతాలకు స్వేచ్ఛ, అవకాశాలను ఇస్తుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుందని తెలిపారు. ఇస్కాన్ సంస్థ ప్రార్ధనలతో రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో రథయాత్ర ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు కొనసాగింది.