ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సీఎం బయలుదేరారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. కొత్తగా కేబినెట్లోకి తీసుకున్న మంత్రుల శాఖల కేటాయింపు పై ఆయన అధిష్టానంతో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే పార్టీ కార్యవర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలియవచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికి సంబంధించి సభల తేదీలను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నేడో, రేపో మంత్రులకు శాఖల కేటాయింపు
రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న ముగ్గురికి నేడో, రేపో శాఖలు కేటాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం పొద్దుపోయాక కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారనే ప్రచారం సాగింది. సామాజిక మాధ్యమాల్లో వారికి ఏయే శాఖలు కేటాయిస్తారో కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఆయా మంత్రులకు శాఖల కేటాయింపుపై సోమవారం లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎవరికీ కేటాయించని శాఖలనే కొత్తవారికి ఇచ్చే చాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఎవరికీ కేటాయించని శాఖలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సీఎం వద్దే ఉన్నాయి. వాటిలో విద్య, పురపాలక, హోం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్థకశాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. కాగా గడ్డం వివేక్కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, యువజన, న్యాయ లేదా మత్స్య శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేతల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తొలిదశ మంత్రివర్గ కూర్పు సమయంలో శాఖల కేటాయింపుపై హైకమాండ్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.